Gopalakrishna Dwivedi: టీడీపీ నేతలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు: ఇసుక మైనింగ్ అంశంపై స్పందించిన గోపాలకృష్ణ ద్వివేది

  • మైనింగ్ అంశంలో ధ్వజమెత్తిన టీడీపీ నేతలు
  •  ఫోర్జరీ డాక్యుమెంట్లు విడుదల చేశారని ద్వివేది విమర్శలు
  • టెండర్ల ద్వారా నిబంధనల ప్రకారమే కేటాయించినట్టు వెల్లడి 
  • ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతీస్తున్నారని వ్యాఖ్య  
Gopalakrishna Dwivedi responds to TDP allegations on sand mining

ఇసుక మైనింగ్ కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయంటూ టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై ఏపీ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది వివరణ ఇచ్చారు. టీడీపీ నేతలు ఏదో కొత్తగా జరిగిపోతోందన్నట్టుగా వ్యాఖ్యలు చేస్తున్నారని, వారి ఆరోపణల్లో నిజంలేదని తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా ప్రయత్నిస్తున్నారని, తప్పుడు ఆరోపణలు చేస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా మైనింగ్ కేటాయింపులు ఏ విధంగా జరిగాయో వివరించారు. ఏపీలో జేపీ పవర్ వెంచర్స్ కు మాత్రమే మైనింగ్ కేటాయింపులు చేశామని, టెండర్ల ద్వారా నిబంధనల ప్రకారమే కేటాయించినట్టు వెల్లడించారు.

సీఎంవో సిఫారసులతో సుధాకర్ ఇన్ ఫ్రా సంస్థకు గోదావరిలో ఇసుక డ్రెడ్జింగ్ అనుమతులు ఇచ్చామన్నది అబద్ధమని స్పష్టం చేశారు. ఈ అంశంలో సుధాకర్ ఇన్ ఫ్రాపై విజయవాడలో కేసు కూడా నమోదైందని, జేపీ సంస్థ నుంచి సబ్ కాంట్రాక్టు పొందినట్టుగా చెప్పుకుంటున్నట్టు సుధాకర్ ఇన్ ఫ్రాపై ఆరోపణలు వచ్చాయని ద్వివేది తెలిపారు. వాస్తవాలు ఇలావుంటే, టీడీపీ నేతలు ఫోర్జరీ డాక్యుమెంట్లను విడుదల చేసి, అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

More Telugu News