Australia: ఆస్ట్రేలియాలో విశాఖ విద్యార్థి మృతి.. చలి వల్ల ఊపిరి అందకపోవడమే కారణం!

  • మెల్‌బోర్న్‌లో డిగ్రీ చదువుతున్న చెన్నకేశవసాయి
  • పార్కులో వాకింగ్ చేస్తుండగా ఊపిరాడక కుప్పకూలిన సాయి
  • మూడు రోజులకు గానీ బయటపడిన వైనం
Visakha Student died in Australia

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో డిగ్రీ చదువుతున్న విశాఖపట్టణానికి చెందిన విద్యార్థి చలి కారణంగా ఊపిరాడక మృతి చెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. నగరంలోని గుల్లలపాలెం వుడా కాలనీకి చెందిన చెన్నకేశవసాయి (20) మెల్‌బోర్న్‌లో ఓ కళాశాలలో బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 16న ఉదయం పార్కులో వాకింగ్ చేస్తుండగా తీవ్రమైన చలి కారణంగా అస్వస్థతకు గురై కుప్పకూలిపోయాడు.

కరోనా ఆంక్షల నేపథ్యంలో అటువైపు ఎవరూ రాకపోయే సరికి  మూడు రోజులకు గానీ విషయం బయటపడలేదు. చెన్నకేశవసాయి కనిపించకపోవడంతో కంగారుపడిన బంధువులు, స్నేహితులు గాలించడంతో పార్కులో అచేతన స్థితిలో కనిపించాడు. వెంటనే వారు సాయిని ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. సాయి మృతదేహం నిన్న విశాఖపట్టణంలోని ఇంటికి చేరుకుంది.

More Telugu News