Somu Veerraju: గోవధ నిషేధంపై కేంద్రం చట్టం చేసినప్పటికీ బీజేపీయేతర రాష్ట్రాల్లో అమలు చేయడంలేదు: సోము వీర్రాజు

  • విజయనగరం జిల్లాలో గోమాంసం పట్టివేత
  • లారీ నిండా గోమాంసం
  • తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సోము వీర్రాజు
  • అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శలు
Somu Veerraju furious comments on cow slaughter

విజయనగరం జిల్లాలో ఓ లారీలో పశుమాంసాన్ని తీసుకెళుతుండగా మైనారిటీ మోర్చా నేతలు అడ్డుకుని పోలీసులకు అప్పగించడంపై రాష్ట్ర బీజేపీ చీఫ్ సోము వీర్రాజు స్పందించారు. లారీ నెంబరు ప్లేటుకు స్టిక్కర్ అంటించుకుని 20 టన్నుల గోమాంసాన్ని తరలిస్తుండగా మైనారిటీ మోర్చా నేతలు అడ్డుకున్నారని వెల్లడించారు. గోవధ నిషేధంపై కేంద్రం చట్టం చేసినప్పటికీ బీజేపీయేతర రాష్ట్రాల్లో ఆ చట్టం అమలు చేయడంలేదని మండిపడ్డారు.

ఇటీవల అధికార వైసీపీ ఎమ్మెల్యే గోవధపై చేసిన వ్యాఖ్యల పట్ల పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే, ఇలాంటి వారి మద్దతుతో హిందువులకు పవిత్రమైన గోవులపై దారుణాలకు తెగబడుతున్నారని విమర్శించారు. ఇలాంటి చర్యలను బీజేపీ, హిందూ సంఘాలు, గోరక్షక దళాలు ఎంతమాత్రం సహించబోవని సోము వీర్రాజు స్పష్టం చేశారు.

ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం స్పందించాలని, గోవులపై అఘాయిత్యాలకు తెగబడుతున్నవారిని పట్టుకుని శిక్షించాలని, భారత రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలను అమలు చేయడంలో తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.

More Telugu News