Cricket: కోహ్లీ బ్యాట్ నుంచి భారీ శతకం రాబోతోంది.. చిన్ననాటి కోచ్ హామీ

  • ఇంగ్లండ్ సిరీసులోనే సెంచరీ
  • లార్డ్స్ టెస్టు విజయం తర్వాత కోహ్లీతో మాట్లాడా
  • కోహ్లీకి చిన్నప్పుడు బ్యాటింగ్ పాఠాలు నేర్పిన రాజ్‌కుమార్ శర్మ
  • 2019 నవంబరు నుంచి సెంచరీ చేయని విరాట్
A huge century is coming from the Kohli bat Childhood coach guarantee

తన ఫామ్‌తో ఇబ్బందులు పడుతున్న టీమిండియా సారధి విరాట్ కోహ్లీ.. త్వరలోనే భారీ సెంచరీతో మన ముందుకొస్తాడని అతని చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ అన్నారు. లార్డ్స్ టెస్టు విజయం తర్వాత కోహ్లీతో మాట్లాడానన్న రాజ్‌కుమార్.. విజయం సాధించినందుకు కోహ్లీ మంచి మూడ్‌లో ఉన్నాడనీ, తన పరుగుల గురించి ఆలోచించడం లేదని చెప్పారు.

తాను కోహ్లీని చిన్నప్పటి నుంచి చూస్తున్నానని, కోహ్లీ ఇలా ఉన్న ప్రతిసారీ అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించాడని రాజ్‌కుమార్ తెలిపారు. 2019 నవంబరులో కోహ్లీ చివరిసారిగా అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ సాధించాడు. ఆ తర్వాత ఒక్క సెంచరీ కూడా చేయలేదు. ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లండ్ సిరీసులో కూడా మూడు ఇన్నింగ్సుల్లో కలిపి కేవలం 62 పరుగులు మాత్రమే చేశాడు.

ఈ సిరీసులో ఇప్పటి వరకూ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఇంగ్లండ్ సారధి జో రూట్ (386) నిలిచాడు. అయితే ఈ విషయం కోహ్లీపై ఎలాంటి ఒత్తిడీ పెట్టలేదని రాజ్‌కుమార్ చెప్పారు. ప్రస్తుతం ఢిల్లీ పురుషుల జట్టుకు హెడ్ కోచ్‌గా రాజ్‌కుమార్ ఉన్నారు.

‘‘కోహ్లీని మోటివేట్ చేయాల్సిన అవసరం ఉందని నేను అనుకోవట్లేదు. అతను పూర్తిగా మోటివేట్ అయ్యున్నాడు’’ అని ఆయన చెప్పారు. రూట్ అద్భుతంగా రాణించడం కోహ్లీకి ఛాలెంజ్‌గా మారుతుందా? అని అడిగితే.. ‘‘జో రూట్‌ను ఛేజ్ చేయడం కోహ్లికి ఛాలెంజే. కానీ భయపడాల్సిన అవసరం లేదు. కోహ్లీని చిన్నప్పటి నుంచి చూస్తున్నా.. అతనికి ఛాలెంజ్‌ అంటే చాలా ఇష్టం. రానున్న మ్యాచుల్లో మనం మంచి పోటీ చూస్తాం’’ అని పేర్కొన్నారు.

More Telugu News