Facebook: అమెరికాలో అత్యధికులు చూసిన ఫేస్​ బుక్​ పోస్ట్​.. ఈ భారత గురూజీ పెట్టిందే: ఫేస్​ బుక్​ నుంచి తొలి నివేదిక

  • అగ్రరాజ్యంలో గౌర్ గోపాల్ దాస్ పోస్ట్ వైరల్
  • 8.06 కోట్ల మంది చూసిన వైనం
  • ఎక్కువ మంది చూసిన పోస్టులపై సంస్థ నివేదిక
Gaur Gopal Das Post Viral In USA Viewed Many Times

సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్ బుక్.. తొట్టతొలి ‘వైడ్ లీ వ్యూడ్ కంటెంట్ రిపోర్ట్ (ఎక్కువ మంది చూసిన పోస్టులపై నివేదిక)’ను విడుదల చేసింది. ఎక్కువగా రైట్ వింగ్ కంటెంట్ నే ఫేస్ బుక్ ప్రచారం చేస్తోందన్న అపవాదుల నేపథ్యంలో సంస్థ ఈ నివేదికను తాజాగా విడుదల చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 మధ్య ఫేస్ బుక్ లో పెట్టిన పోస్టులపై సంస్థ ఈ రిపోర్ట్ ను తయారు చేసింది.

అందరిలోనూ స్ఫూర్తి నింపే పాఠాలను బోధించే భారత గురూజీ గౌర్ గోపాల్ దాస్ పెట్టిన ఓ పోస్ట్.. నివేదికలో తొలి స్థానంలో నిలిచింది. అమెరికాలో అత్యధికులు ఆయన పెట్టిన పోస్ట్ ను చూశారు. దాదాపు 8.06 కోట్ల వీక్షణలతో గోపాల్ దాస్ పోస్ట్ మొదటి స్థానాన్ని దక్కించుకుంది.

 ఆ పోస్ట్ లో ఆయన.. అక్షరాల పజిల్ ను పోస్ట్ చేసి అందులో మూడు పదాలను గుర్తించమని టాస్క్ పెట్టారు. సదరు వ్యక్తులు చూసే మొదటి మూడు పదాలే వారి వారి జీవిత సత్యాలు అని ఆ పోస్టులో పేర్కొన్నారు. ఆయనకు గ్రాటిట్యూడ్ (సంతోషం), కనెక్షన్ (బంధం), చేంజ్ (మార్పు) అనే పదాలు కనిపించినట్టు చెప్పారు. ఈ జాబితాలో మ్యూజీషియన్ ఏస్ గుత్తా పెట్టిన పోస్టు.. 6.14 కోట్లతో రెండో స్థానంలో ఉంది.

ఎక్కువ మంది ఫొటోలు, వీడియో పోస్ట్ లనే చూశారని ఫేస్ బుక్ ఆ రిపోర్ట్ లో వెల్లడించింది. ఇక, వార్తా సంస్థలకు సంబంధించిన పోస్టులను కేవలం 0.3 శాతం మందే చూశారని సంస్థ ప్రకటించింది. యూట్యూబ్, అమెజాన్, యునిసెఫ్ వంటి సంస్థల లింకులను ఫేస్ బుక్ ద్వారా చూశారు. గ్రీన్ బే ప్యాకర్స్ అమెరికన్ ఫుట్ బాల్ టీమ్ వెబ్ సైట్ ను అత్యధికంగా 8.72 కోట్ల మంది చూశారు.

More Telugu News