ATM: బ్యాంకులకు షాకిచ్చిన ఆర్‌బీఐ.. ఏటీఎంలలో నగదు లేకుంటే జరిమానా!

  • ప్రజల అవస్థలపై స్పందించిన ఆర్‌బీఐ
  • నెలలో పది గంటలకు మించి ఏటీఎం ఖాళీగా ఉంటే రూ. 10 వేల జరిమానా
  • అక్టోబరు 1 నుంచే అమల్లోకి..
RBI asks banks to monitor availability of cash in ATMs

ఏటీఎంలలో నగదు నింపకుండా నిర్లక్ష్యం వహిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న బ్యాంకులకు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) షాకిచ్చింది. ఇకపై ఏటీఎంలు ఖాళీగా దర్శనమిస్తే జరిమానా తప్పదని హెచ్చరించింది. ఏటీఎంలలో నగదు లేని సమయం ఒక నెలలో 10 గంటలు దాటితే రూ. 10 వేలు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించిన ఆర్‌బీఐ.. అక్టోబరు ఒకటో తేదీ నుంచే ఈ నిబంధన అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.

ఏటీఎంలు ఖాళీ అయినా నగదు నింపకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని ఈ సందర్భంగా ఆర్‌బీఐ పేర్కొంది. కాబట్టి నోట్ల లభ్యతను పర్యవేక్షించే బాధ్యతను బలోపేతం చేసుకోవాలని బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం (డబ్ల్యూఎల్ఏ) ఆపరేటర్లను ఆదేశించింది. ఏటీఎంలలో నగదు అందుబాటులో లేకుంటే వాటికి డబ్బు అందజేసే బాధ్యత కలిగిన బ్యాంకులకు జరిమానా తప్పదని ఆర్‌బీఐ హెచ్చరించింది.

More Telugu News