Bhajrang Punia: టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం గెలిచిన భారత రెజ్లర్ భజరంగ్ పునియా

  • భారత్ ఖాతాలో ఆరో పతకం
  • రెజ్లింగ్ లో మెరిసిన భజరంగ్ పునియా
  • 65 కిలోల విభాగంలో అద్భుత విజయం
  • 8-0తో కజకిస్థాన్ రెజ్లర్ ను చిత్తుచేసిన వైనం
Bhajrang Punia wins bronze in Tokyo Olympics

టోక్యో ఒలింపిక్స్ లో భారత స్టార్ రెజ్లర్ భజరంగ్ పునియా కాంస్యం సాధించాడు. ఈ మధ్యాహ్నం కాంస్యం కోసం జరిగిన పోరులో భజరంగ్ 8-0తో కజకిస్థాన్ కు చెందిన దౌలత్ నియాజ్ బెకోవ్ ను మట్టికరిపించాడు. పురుషుల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ 65 కేజీల విభాగంలో జరిగిన ఈ పోరులో భజరంగ్ పునియా తన స్థాయికి తగిన ప్రదర్శన కనబరిచాడు. సెమీఫైనల్లో ఓటమి అనంతరం కుంగిపోకుండా, ఈ మ్యాచ్ లో తన నైపుణ్యాన్ని ప్రదర్శించి భారత్ ఖాతాలో ఆరో పతకాన్ని చేర్చాడు. భారత్ కు టోక్యో ఒలింపిక్స్ లో ఇప్పటిదాకా 2 రజతాలు, 4 కాంస్యాలు లభించాయి.. అంతకుముందు లండన్ ఒలింపిక్స్ లోనూ భారత్ కు 6 పతకాలు లభించగా, ఇప్పుడా పతకాల సంఖ్యను భారత్ సమం చేసింది.

భజరంగ్ పతక సాధనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. టోక్యో నుంచి సంతోషకరమైన వార్త అందిందని తెలిపారు. భజరంగ్ కళ్లు చెదిరే పోరాటం కనబర్చాడని కితాబునిచ్చారు. "ప్రతి భారతీయుడు గర్వపడేలా చేసే విజయం సాధించినందుకు నీకు శుభాభినందనలు" అంటూ భజరంగ్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు.

కాగా, పునియా విజయంతో భారత శిబిరంలో సంబరాలు షురూ అయ్యాయి. ఈ గెలుపుపై భజరంగ్ పునియా తండ్రి బల్వాన్ సింగ్ స్పందిస్తూ తన కలను కుమారుడు నిజం చేశాడని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కాంస్య పతకం తనకు స్వర్ణ పతకంతో సమానమని ఆయన పేర్కొన్నారు.

More Telugu News