Telangana: ఏపీ అధికారుల హాజరు.. తెలంగాణ డుమ్మా!

  • కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ సమన్వయ కమిటీ సమావేశం
  • అభ్యంతరాలున్న ప్రాజెక్టుల వివరాలివ్వాలని ఆదేశం
  • ఇవ్వలేమని చెప్పిన ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి
Telangana Not Attended The KRMB and GRMB Coordinating Committee Meeting

బోర్డులు అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రాజెక్టుల వివరాలను సమర్పించలేమని ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్ సీ) నారాయణరెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర జల్ శక్తి శాఖ ఇటీవల ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ లో చేర్చిన ప్రాజెక్టులపై అభ్యంతరాలున్నాయని, వాటిని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని ఆయన చెప్పారు.

ఇవాళ హైదరాబాద్ లోని జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ), గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ)ల సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి అధికారులెవరూ హాజరు కాలేదు. కేంద్ర జల్ శక్తి శాఖ ప్రతినిధి, బోర్డుల సభ్యులు, ఏపీ ఈఎన్ సీలు, ట్రాన్స్ కో, జెన్ కో ఎండీలు హాజరయ్యారు.

సమావేశంలో భాగంగా ప్రాజెక్టుల వివరాలను ఇవ్వాల్సిందిగా తెలుగు రాష్ట్రాలను రెండు బోర్డులు కోరాయి. ఇకపై సమన్వయ కమిటీ సమావేశాలు ఎప్పుడూ జరుగుతుంటాయని చెప్పాయి. ఈ నెల రెండో వారంలో బోర్డు పూర్తి స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తామని జీఆర్ఎంబీ తెలిపింది.

గెజిట్ నోటిఫికేషన్ లోని ప్రాజెక్టులపై మరింత స్పష్టత కావాలని నారాయణ రెడ్డి అన్నారు. ప్రాజెక్టుల వివరాలను ఇచ్చే విషయంపై ప్రభుత్వం నిర్ణయం ప్రకారం నడుచుకుంటామని బోర్డులకు తెలిపారు.

More Telugu News