Prime Minister: వారి చేష్టలు, వ్యాఖ్యలు దేశాన్ని కించపరిచేలా ఉన్నాయి... ప్రతిపక్షాలపై ప్రధాని మండిపాటు

  • రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, పార్లమెంట్ ను అవమానించారన్న మోదీ
  • రభస చేస్తూ వాయిదాలకు కారణమయ్యారు
  • పేపర్లను లాక్కుని చించేస్తారా?
Prime Minister Narendra Modi Expresses Displeasure Over Opposition Acts In Parliament

ప్రతిపక్షాలపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి మండిపడ్డారు. సమావేశాలను సక్రమంగా సాగనివ్వకుండా పార్లమెంటును అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, దేశ ప్రజలను అవమానించారన్నారు. ప్రతిపక్షాలు బాధ్యతారహితంగా వ్యవహరించాయని, నానా రభస చేస్తూ సభ వాయిదాలకు కారణమయ్యాయని అన్నారు. ఈరోజు ఆయన బీజేపీ ఎంపీలతో సమావేశమయ్యారు.

ఉభయ సభల్లో ప్రతిపక్ష ఎంపీలు వ్యవహరించిన తీరు సరిగ్గా లేదన్నారు. మంత్రి చేతుల్లోని పేపర్లను లాక్కుని చించేయడం, వాటిని స్పీకర్ మీదకు విసిరేయడం మంచిది కాదని అన్నారు. పేపర్లు చించిన ఎంపీకి కనీసం విచారం కూడా లేదన్నారు. కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చేతుల్లోని పేపర్లను లాక్కుని తృణమూల్ ఎంపీ శంతనూ సేన్ చించేసిన సంగతి తెలిసిందే. ఆ విషయాన్నే ఆయన ప్రస్తావించారు.

మరోవైపు బిల్లులను పాస్ చేయడంపై తృణమూల్ పార్టీ మరో ఎంపీ డెరెక్ ఓ బ్రయన్ చేసిన వ్యాఖ్యలపైనా ప్రధాని మండిపడ్డారు. అవి దేశాన్ని కించపరిచేలా ఉన్నాయన్నారు. బిల్లులు పాస్ చేస్తున్నారా? లేదంటే ‘పాప్రి చాట్’ చేస్తున్నారా? అంటూ డెరెక్ విమర్శించారు. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, రాజ్యసభ డిప్యూటీ చైర్ పర్సన్ ఎంఏ నఖ్వీ అభ్యంతరం వ్యక్తం చేశారు. బిల్లులను త్వరితగతిన పాస్ చేయాలని తమకూ లేదని, చర్చకు సిద్ధంగానే ఉన్నామని చెప్పారు. బాధ్యతారహితమైన వ్యాఖ్యలతో పార్లమెంట్ ను అవమానించిన తృణమూల్ ఎంపీ.. దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

More Telugu News