PV Sindhu: పీవీ సింధును అభినందించిన పార్లమెంటు ఉభయసభలు

  • టోక్యో ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ లో కాంస్య పతకాన్ని సాధించిన సింధు
  • వరుసగా రెండు ఒలింపిక్స్ లో పతకం సాధించిన తొలి భారత మహిళగా ఘనత
  • అభినందనలు తెలిపిన వెంకయ్యనాయుడు, ఓం బిర్లా
Parliament congratulates PV Sindhu for winning medal in Tokyo Olympics

టోక్యో ఒలింపిక్స్ మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ లో కాంస్య పతకాన్ని సాధించిన తెలుగు తేజం పీవీ సింధుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. వరుసగా రెండు ఒలింపిక్స్ లలో పతకం సాధించిన భారత తొలి మహిళా క్రీడాకారిణిగా రికార్డు సృష్టించిన సింధును పార్లమెంటు ఉభయభలు అభినందించాయి. వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఉభయసభలు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి.

సభ ప్రారంభమైన వెంటనే లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సింధు సాధించిన ఘనత గురించి సభలో ప్రస్తావించారు. టోక్యో ఒలింపిక్స్ లో పీవీ సింధు కాంస్య పతకాన్ని సాధించడం సంతోషకరమని స్పీకర్ అన్నారు. ఒలింపిక్స్ లో ఆమెకు వరుసగా ఇది రెండో పతకమని చెప్పారు. వ్యక్తిగత ఈవెంట్లలో రెండు పతకాలు అందుకున్న తొలి భారతీయ మహిళ సింధు కావడం విశేషమని అన్నారు. చారిత్రాత్మకమైన విజయం అందుకున్న సింధుకు యావత్ దేశం తరపున అభినందనలు తెలుపుతున్నామని చెప్పారు. సింధు గెలుపు దేశ యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు.

మరోవైపు పెద్దలసభలో కూడా సింధు సాధించిన విషయం గురించి మాట్లాడుతూ రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ప్రశంసలు కురిపించారు. తన అద్భుత ప్రదర్శనతో ఆమె చరిత్ర సృష్టించారని చెప్పారు.

More Telugu News