ప్రాథమిక స్వేచ్ఛను నమ్ముతాం: అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్
- పౌర సంఘాల ప్రతినిధులతో భేటీ
- నేటి సాయంత్రం ప్రధానితో సమావేశం
- ఆఫ్ఘన్, కరోనా, రక్షణ రంగాలపై చర్చ
ఈ రోజు సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో బ్లింకెన్ సమావేశం కానున్నారు. విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ , జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తోనూ భేటీ అవుతారు. భారత్, అమెరికా వంటి ప్రజాస్వామ్య దేశాలకు ప్రాథమిక స్వేచ్ఛ, చట్టాలే పటిష్ఠ పునాదులని బ్లింకెన్ అన్నారు. ‘‘మానవ గౌరవం, సమాన అవకాశాలు, చట్టం, ప్రాథమిక స్వేచ్ఛ వంటి వాటిని భారత్, అమెరికా ప్రజలు ఎప్పుడూ విశ్వసిస్తారు. మత స్వేచ్ఛనూ నమ్ముతారు’’ అని అన్నారు.

అంతకుముందు దేశంలోని పౌర సంఘాల ప్రతినిధులతో బ్లింకెన్ సమావేశమయ్యారు. సమావేశంలో భాగంగా ఆఫ్ఘనిస్థాన్ లో దిగజారిపోతున్న పరిస్థితులు, తాలిబన్ ఆగడాలపై చర్చించనున్నారు. కరోనా వ్యాక్సిన్ల ఉత్పత్తికి కావాల్సిన ముడి పదార్థాల నిరంతర సరఫరాపై మాట్లాడనున్నారు. రక్షణ రంగంలో భాగస్వామ్యం, సహకారాన్ని మరింతగా బలోపేతం చేసే విషయమూ చర్చకు రానుంది.