Revanth Reddy: సోనియానే తెలంగాణ తల్లి.. కేసీఆర్ తెలంగాణ మారీచుడు: రేవంత్ రెడ్డి

  • తెలంగాణను ఇచ్చిన సోనియా ఫొటో ప్రతి ఇంట్లో ఉండాలి
  • కేసీఆర్ ఫాంహౌస్ లో తెలంగాణ తల్లి బందీ అయింది
  • కరోనా కంటే మోదీ, కేసీఆర్ ప్రమాదకరం
Sonia is Telangana Thalli says Revanth Reddy

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీనే అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ తల్లి ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదని... సోనియాగాంధీనే తెలంగాణ తల్లి అని చెప్పారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఇచ్చిన సోనియా ఫొటో రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో ఉండాలని ఆయన అన్నారు.

తెలంగాణలో మారీచుడు, రావణాసురుడు కేసీఆర్ అని... కేసీఆర్ ఫాంహౌస్ లో తెలంగాణ తల్లి బందీ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ, కేసీఆర్ పాలనలో పేదోడు బతికే పరిస్థితి లేదని... కరోనా కంటే వీరిద్దరూ ప్రమాదకరమని రేవంత్ మండిపడ్డారు. కేసీఆర్ వచ్చాక రాష్ట్రంలో ఎన్ కౌంటర్లు, ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ప్రశాంత్ కిశోర్ ను సలహాదారుడిగా పెట్టుకోవాలని కొందరు సూచిస్తున్నారని... పాదరసం లాంటి తమ పార్టీ కార్యకర్తలే తమకు పీకేలని అన్నారు. తమ కార్యకర్తలే ఏకే-47 తూటాలని చెప్పారు.

ఇదే సమయంలో... రేవంత్ రెడ్డి సీఎం అంటూ నినాదాలు చేస్తున్న అభిమానులకు ఆయన స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి నినాదాలు చేస్తే పార్టీ నుంచి బహిష్కరిస్తానని చెప్పారు. ఇలాంటి నినాదాల వల్ల పార్టీ బలహీనపడుతుందని అన్నారు. అందరు నేతలను కలుపుకునిపోయి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు.

More Telugu News