Shruti Das: తన శరీర ఛాయపై ట్రోల్ చేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి

  • త్రినయని సీరియల్ తో ఎంట్రీ ఇచ్చిన శ్రుతిదాస్
  • గత కొన్నాళ్లుగా డైరెక్టర్ తో ప్రేమ
  • నల్లగా ఉందంటూ ట్రోలింగ్
  • ఈమెయిల్ ద్వారా సైబర్ పోలీసులకు ఫిర్యాదు
TV actress Shruti Das complains on being trolled

సోషల్ మీడియాలో సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని ట్రోల్ చేసే ధోరణులు అధికమవుతున్నాయి. తాజాగా, తన శరీర రంగును అపహాస్యం చేస్తూ ట్రోలింగ్ కు పాల్పడుతున్నారని బెంగాలీ బుల్లితెర నటి శ్రుతి దాస్ (25) పోలీసులను ఆశ్రయించారు. గత రెండేళ్లుగా తాను ఈ వేధింపులను భరిస్తున్నానని, కానీ ఇటీవల మితిమిరిన స్థాయిలో ట్రోలింగ్ జరుగుతుండడంతో కోల్ కతా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు శ్రుతి దాస్ వెల్లడించారు.

సోషల్ మీడియా ట్రోలింగ్ ను పట్టించుకోవద్దని తనకు చాలామంది సూచించారని, ఆ విధంగానే ఇప్పటివరకు మౌనంగా ఉన్నానని తెలిపారు. తన మొట్టమొదటి టీవీ సీరియల్ త్రినయని దర్శకుడితో ప్రేమలో ఉన్నానని, ఈ విషయం వెల్లడి కావడంతో సోషల్ మీడియాలో వేధింపులు అధికం అయ్యాయని శ్రుతి పేర్కొన్నారు. తన వ్యక్తిత్వాన్ని, తన ప్రతిభను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా, ఈమెయిల్ ద్వారా బెంగాలీ నటి శ్రుతి దాస్ ఫిర్యాదును స్వీకరించినట్టు ఓ సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

More Telugu News