Covishield: కొవిషీల్డ్, కొవాగ్జిన్ లను అంగీకరించకుంటే... ఈయూ దేశాలకు భారత్ వార్నింగ్!

  • ఇండియాలో తయారైన టీకాలకు అనుమతి ఇవ్వని ఈయూ
  • ఈయూ దేశాలు ఇచ్చే వ్యాక్సిన్ ను అంగీకరించబోమన్న ఇండియా
  • వస్తే తప్పనిసరి క్వారంటైన్ విధిస్తామని హచ్చరిక
India Warns EU on Covishield and Covaxin

గ్రీన్‌ పాస్‌ పోర్ట్‌ స్కీమ్‌ కింద యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) ప్రయాణ ఆంక్షలను సడలించినప్పటికీ, ఇండియాలో తయారవుతున్న కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకాలను తీసుకున్న వారిని మాత్రం పరిగణనలోకి తీసుకోకపోవడంపై కేంద్రం తీవ్రంగా స్పందించింది.

భారతీయులను కూడా యూరప్‌ దేశాల్లో పర్యటించేందుకు అనుమతించాలని కోరుతూనే, అందుకు అంగీకరించకుంటే, ఈయూ దేశాలు జారీ చేసే వ్యాక్సిన్ సర్టిఫికెట్లను తాము అంగీకరించబోమని, ఈయూ నుంచి వచ్చే ప్రయాణికులు ఇండియాకు రాగానే తప్పనిసరి క్వారంటైన్ లోకి వెళ్లేలా నిబంధనలను సవరిస్తామని హెచ్చరించింది.

ప్రస్తుతం ఇండియాలో సీరమ్ తయారు చేస్తున్న కొవిషీల్డ్, భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కొవాగ్జిన్ టీకాలను తీసుకున్న వారు చూపించే డిజిటల్ సర్టిఫికెట్లను పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈయూకు స్పష్టం చేసినట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు.

ప్రస్తుతం యూరోపియన్ యూనియన్ దేశాల్లో యూరోపియన్ మెడిసిన్ ఏజన్సీ అనుమతించిన టీకాలను తీసుకున్న వారిని మాత్రమే అనుమతిస్తున్నారు. వాటిల్లో ఫైజర్, మోడెర్నా, ఆస్ట్రాజెనికా, జాన్సస్ టీకాలు ఉన్నాయి. ఆస్ట్రాజెనికా సంస్థ తయారు చేస్తున్న టీకానే సీరమ్ ఇనిస్టిట్యూట్ 'కొవిషీల్డ్' పేరిట తయారు చేస్తుండగా, భారత వర్షన్ ను మాత్రం ఈయూ ఒప్పుకోవడం లేదు. ఇక ఇదే విషయమై భారత్ లో ఈయూ ప్రతినిధి ఉగో అస్టుటోను ప్రశ్నించగా, టీకాల విషయంలో ప్రతి అనుమతి పొందాలంటే, కొన్ని నిబంధనలను పాటించాల్సి వుంటుందని వ్యాఖ్యానించారు.

More Telugu News