KCR: వైద్య ఆరోగ్య సిబ్బంది సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నాం: సీఎం కేసీఆర్

  • డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
  • ప్రజారోగ్యం కోసం ప్రత్యేక కార్యాచరణ
  • డాక్టర్లు కీలక పాత్ర పోషించాలని పిలుపు
  • డాక్టర్లకు, వారి కుటుంబ సభ్యులకు అభినందనలు
CM KCR wishes doctors on National Doctors Day

నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యులకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా, ఆరోగ్య తెలంగాణను సాకారం చేయడమే ధ్యేయంగా ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్టు సీఎం వెల్లడించారు. ఈ ఆరోగ్య యజ్ఞంలో కీలక పాత్ర పోషించాలని, ప్రజారోగ్యం దిశగా తమ కృషిని మరింత పొడిగించాలని రాష్ట్రంలోని ప్రతి డాక్టర్ కు పిలుపునిస్తున్నట్టు తెలిపారు.

 వైద్య, ఆరోగ్య వ్యవస్థ బలోపేతానికి ఇప్పటికే పలు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశామని, దేశంలోనే ప్రథమంగా జిల్లా కేంద్రాల్లో అన్ని రకాల రోగాల నిర్ధారణ కేంద్రాలు నెలకొల్పామని సీఎం కేసీఆర్ వివరించారు. హైదరాబాదు, వరంగల్ సహా పలు చోట్ల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటుకు కార్యాచరణ ప్రారంభమైందని తెలిపారు. రానున్న కాలంలో ఖర్చుకు వెనుకాడకుండా ఈ కార్యాచరణను మరింత ముందుకు తీసుకెళతామని ఉద్ఘాటించారు.

ఈ క్రమంలో వైద్యులు, నర్సులు, ఇతర వైద్య ఆరోగ్య సిబ్బంది సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కరోనా సహా అన్ని ఆరోగ్య విపత్తుల సమయాల్లోనూ డాక్టర్ల సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. ముఖ్యంగా కరోనా సమయంలో తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా రోగులకు సేవలు అందించారంటూ డాక్టర్లను, వారి కుటుంబ సభ్యులను ప్రస్తుతించారు.

More Telugu News