Terrorism: జమ్మూ ఎయిర్​ బేస్​ పై డ్రోన్​ దాడి ఘటనను ఐరాసలో లేవనెత్తిన భారత్​

India Concerns In UNGA Over Drone Attacks On Jammu Air Force Station
షార్ట్స్‌లో చూడండి
జమ్మూలో డ్రోన్ల కలకలం పెరిగిపోవడం, ఎయిర్ బేస్ పై వాటితో దాడులు చేయడం వంటి ఘటనలపై ఐక్యరాజ్యసమితిలో భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఉగ్రవాద కార్యకలాపాలకు డ్రోన్లు వాడడం అత్యంత తీవ్రమైన విషయమని పేర్కొంది. వీటిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని చెప్పింది.

‘‘సమాచార సాంకేతిక రంగాన్ని నేడు దుర్వినియోగం చేస్తున్నారు. ఉగ్రవాద కార్యకలాపాల కోసం వాడుతున్నారు. ఇంటర్నెట్, సోషల్ మీడియా వంటి వాటితో ఉగ్రవాదాన్ని ప్రచారం చేస్తున్నారు. వాటిద్వారా ఉగ్రవాదులను నియమించుకుంటున్నారు. పేమెంట్ పద్ధతులు, క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ ఫాంలనూ డబ్బుల కోసం ఉగ్రవాద సంస్థలు దుర్వినియోగం చేస్తున్నాయి. నూతన టెక్నాలజీ ఏది వచ్చినా ఉగ్రవాదులు వాటిని దుర్వినియోగ పరుస్తున్నారు. ఇప్పుడు మానవాళికి ఉగ్రవాదంతో పొంచి ఉన్న పెను ముప్పు ఇదే’’ అని కేంద్ర హోం శాఖ ప్రత్యేక కార్యదర్శి (అంతర్గత భద్రత) వి.ఎస్.కె. కౌముది ఆందోళన వ్యక్తం చేశారు.

ఐరాస సాధారణ సభలోని సభ్య దేశాల ఉగ్రవాద వ్యతిరేక సంస్థల అధిపతులతో నిర్వహించిన రెండో అత్యున్నత స్థాయి సదస్సులో పాల్గొన్న ఆయన.. తక్కువ ధరకే రావడం, ఈజీగా వాటిని వాడుకోగలగడం వంటి కారణాలతో ఉగ్రవాదులు డ్రోన్లను దుశ్చర్యలకు వాడుతున్నారని చెప్పారు. నిఘా సమాచార సేకరణ, ఆయుధ/పేలుడు పదార్థాల చేరవేత, లక్షిత దాడులకు వాటిని ఎక్కువగా వినియోగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భద్రతా సంస్థలకు పెను సవాళ్లు, ముప్పు ఎదురవుతాయన్నారు.

వ్యూహాత్మక, వాణిజ్య సంబంధిత ఆస్తులపై డ్రోన్లతో దాడి చేస్తున్న ఘటనలపై సభ్య దేశాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. ఇక, ఉగ్రవాదులకు సోషల్ మీడియా ఒక టూల్ కిట్ లా ఉపయోగపడుతోందన్నారు. కృత్రిమ మేధ, రోబోటిక్స్, డీప్ ఫేక్స్, బ్లాక్ చెయిన్, డార్క్ వెబ్ వంటి వాటితో ఉగ్రవాదులకు అకృత్యాలకు తెగబడుతున్నారన్నారు.
Go Back to Shorts
Terrorism
Drone
Jammu And Kashmir
UNGA
United Nations
India

More Telugu News