రూ.100 కోసం యూనివర్సిటీ మాజీ వీసీ హత్య!

University former VC killed for hundred rupees
  • ఒడిశాలో ఘటన
  • సంబల్ పూర్ వర్సిటీ మాజీ వీసీ దారుణహత్య
  • నివాసంలోకి చొరబడిన దుండగుడు
  • డబ్బు కోసం డిమాండ్
  • నిరాకరించిన మాజీ వీసీ
  • గొడ్డలితో దాడి చేసిన దుండగుడు
డబ్బు కోసం ఎంత ఘాతుకానికైనా పాల్పడే కిరాతకులు ఉన్న రోజులివి! ఒడిశాలో రూ.100 కోసం ఓ యూనివర్సిటీ మాజీ వీసీని హత్య చేయడం అందుకు పరాకాష్ఠ. సంబల్ పూర్ వర్సిటీ మాజీ వీసీ ధ్రుబరాజ్ నాయక్ ఝార్సుగూడ జిల్లాలోని సర్గిగూడలో నివసిస్తున్నారు. ఇవాళ ఆయనం నివాసంలోకి చొరబడిన ఓ దుండగుడు నగదు డిమాండ్ చేశాడు. మాజీ వీసీ డబ్బు ఇచ్చేందుకు నిరాకరించడంతో తీవ్ర కోపోద్రిక్తుడైన ఆ వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన ఆయన మృతి చెందడంతో ఆ దుండగుడు అక్కడ్నించి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఈ కేసులో నిందితుడిగా భావిస్తున్న 20 ఏళ్ల ప్రబిణ్ ధరువాను సమీపంలోని అటవీప్రాంతంలో ఉండగా అరెస్ట్ చేశారు. పోలీసులు అతడిని విచారిస్తున్నారు.

కాగా, మాజీ వీసీ ధ్రుబరాజ్ నాయక్ పర్యావరణవేత్తగానూ ప్రసిద్ధికెక్కారు. తాను నివాసం ఉంటున్న గ్రామంలోనే ఆయన మొక్కలు నాటి అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. ఈ క్రమంలో చెట్లు నరికిన కొందరు గ్రామస్తులతో తగాదాలు, ఓ చెరువు విషయంలో వివాదం కూడా ఈ హత్యకు కారణమై ఉండొచ్చన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ బికాస్ చంద్ర దాస్ వెల్లడించారు.
Go Back to Shorts
Dhrubaraj Naik
Murder
Rs.100
Former VC
Sambalpur University
Odisha

More Telugu News