Uttar Pradesh: మజ్లిస్​ తో పొత్తు లేదు.. ఒంటరిగానే యూపీ ఎన్నికల్లో బరిలోకి: స్పష్టం చేసిన బీఎస్పీ అధినేత్రి మాయావతి

  • మీడియా కథనాలపై అసంతృప్తి
  • అవన్నీ తప్పుడు కథనాలని వెల్లడి
  • నిజాలను నిర్ధారించుకున్నాకే ప్రసారం చేయాలని విజ్ఞప్తి
No Alliance With MIM Clarifies BSP Supremo Mayawati

త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. మజ్లిస్ (ఏఐఎంఐఎం)తో పొత్తు పెట్టుకుంటున్నారన్న వార్తలను ఆమె కొట్టిపారేశారు. మజ్లిస్ తో పొత్తు పెట్టుకుంటున్నారన్న మీడియా కథనాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆమె.. మజ్లిస్ తో పొత్తు ప్రసక్తే లేదని ట్వీట్ చేశారు.

‘‘మేం అసదుద్దీన్ ఒవైసీకి చెందిన మజ్లిస్ తో పొత్తు పెట్టుకుంటున్నామని నిన్నటి నుంచి ఓ చానెల్ వార్తను ప్రసారం చేస్తోంది. ఆ వార్తల్లో నిజం లేదు. అవన్నీ నిరాధారమైన బూటకపు వార్తలు. పంజాబ్ లో లాగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోం. ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేస్తాం’’ అని ఆమె స్పష్టం చేశారు.

తప్పుదోవ పట్టించే ఇలాంటి నిరాధారమైన వార్తలపై పోరాడేందుకు రాజ్యసభ ఎంపీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సతీశ్ చంద్ర మిశ్రాను పార్టీ నేషనల్ కో ఆర్డినేటర్ గా నియమిస్తున్నట్టు ప్రకటించారు. ఇలాంటి వార్తలు రాసే ముందు ఒక్కసారి సతీశ్ తో మీడియా మాట్లాడాలని, నిజాలను నిర్ధారించుకున్నాకే వార్తలను ప్రసారం చేయాలని ఆమె మీడియాను కోరారు.

More Telugu News