Corona Virus: వందేళ్ల క్రితం స్పానిష్ ఫ్లూ కూడా మూడో ద‌శ‌లో విజృంభించింది: ఎయిమ్స్ న్యూరాలజీ హెడ్ ప‌ద్మ‌

  • దేశంలో మూడోద‌శ క‌రోనా విజృంభ‌ణ త‌ప్ప‌కుండా ఉంటుంది
  • ప్ర‌తి  నిపుణుడూ అంచ‌నా వేస్తున్నారు
  • ఇప్ప‌టికే మ‌నం రెండోద‌శ క‌రోనా విజృంభ‌ణ‌ను ఎదుర్కొంటున్నాం
  • మూడో ద‌శ విజృంభ‌ణ‌కు త‌లుపులు తెరుస్తున్నాం
Everyone is predicting a third wave AIIMS doctor

దేశంలో క‌రోనా మూడోద‌శ ముప్పు ఉన్న‌ప్ప‌టికీ రాష్ట్రాల‌న్నీ లాక్‌డౌన్‌, క‌ర్ఫ్యూ ఆంక్ష‌ల‌ను స‌డ‌లిస్తుండ‌డం ప‌ట్ల ఢిల్లీలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) వైద్యులు అభ్యంత‌రాలు తెలుపుతున్నారు. ఎయిమ్స్ న్యూరాలజీ డిపార్ట్‌మెంట్ హెడ్ ఎంవీ ప‌ద్మ శ్రీవాస్తవ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ ఈ విష‌యంపై స్పందించారు.

దేశంలో మూడోద‌శ క‌రోనా విజృంభ‌ణ త‌ప్ప‌కుండా ఉంటుంద‌ని ప్ర‌తి ఒక్క నిపుణుడూ అంచ‌నా వేస్తున్నార‌ని ఆమె గుర్తు చేశారు. క‌రోనా సోక‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం మానకూడ‌ద‌ని వారు చెబుతున్నార‌ని, లేదంటే మూడో ద‌శ ముప్పు త‌ప్ప‌ద‌ని అంటున్నార‌ని ఆమె తెలిపారు.

వందేళ్ల క్రితం స్పానిష్ ఫ్లూ కూడా మూడో ద‌శ‌లోనూ విజృంభించింద‌ని, చ‌రిత్ర  పున‌రావృతం అవుతుంద‌ని అన్నారు. వైర‌స్‌కు సంబంధించి ఎన్నో వేరియంట్లు పుట్టుకురావ‌డంతో పాటు ప‌లు అంశాలు దీనికి కార‌ణాలుగా చెప్పవ‌చ్చ‌న్నారు.

'ఇప్ప‌టికే మ‌నం రెండోద‌శ క‌రోనా విజృంభ‌ణ‌ను ఎదుర్కొంటున్నాం. అంతేగాక‌, మూడో ద‌శ విజృంభ‌ణ‌కు త‌లుపులు తెరుస్తున్నాం. అందుకే క‌రోనా మ‌రోసారి విజృంభించ‌కుండా అన్ని జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని, మ‌న తీరు మారాల‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. క‌రోనాను అదుపు చేయ‌డం అనేది కేవ‌లం ప్ర‌భుత్వ‌, వైద్య వ్య‌వ‌స్థ బాధ్య‌త కాదు. ఇది నా బాధ్య‌త‌.. స‌మాజంలోని ప్రతి భార‌తీయుడి బాధ్య‌త‌' అని ప‌ద్మ వ్యాఖ్యానించారు.

More Telugu News