Telangana: నేను ఏ సంస్థలోనూ డైరెక్టర్​ గా లేను.. ఈడీ నోటీసులపై తొలిసారి నామా స్పందన

For the First Time Nama Responds Over ED Notices
  • తనకు నోటీసులివ్వడంపై నామా ఆవేదన
  • ప్రాజెక్టులో నిధులు మళ్లించే అవకాశమే లేదని వ్యాఖ్య 
  • కేసీఆరే తన బలమన్న ఖమ్మం ఎంపీ
తాను ఏ సంస్థలోనూ డైరెక్టర్ గా లేనని, ఈడీ విచారణకు పూర్తిగా సహకరిస్తానని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు.  ఝార్ఖండ్ లో మధుకాన్ కంపెనీ చేపట్టిన రాంచీ నేషనల్ హైవే ప్రాజెక్టు కోసం తీసుకున్న రుణాల్లో కొంత మొత్తాన్ని అక్రమమార్గాల్లో మళ్లించారన్న ఆరోపణలతో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇచ్చిన నోటీసులపై ఆయన తొలిసారి స్పందించారు.  

20 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉంటున్నానని, 40 ఏళ్ల క్రితమే మధుకాన్ సంస్థను స్థాపించానని చెప్పారు. ఎన్నో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను చేపట్టామన్నారు. రాంచీ ఎక్స్ ప్రెస్ వే ఎస్పీవీ కంపెనీ.. బీవోటీ పద్ధతిలోనే రాంచీ నేషనల్ హైవే ప్రాజెక్టును చేపట్టిందన్నారు. అయితే, పలు విచారణల కారణంగా హైవే అభివృద్ధిపై సంస్థ వెనక్కు వెళ్లిందన్నారు. ఎస్క్రో ఖాతాపై బ్యాంకుకే పూర్తి అధికారం ఉందన్న ఆయన.. తాను సంస్థ డైరెక్టర్ గా లేకపోయినా ఈడీ నోటీసులు ఇచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ప్రాజెక్టులో నిధులు మళ్లించే అవకాశమే లేదన్నారు. తన బలం సీఎం కేసీఆర్, ఖమ్మం ప్రజలేనని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తాను టీఆర్ఎస్ లోనే ఉంటానని తేల్చి చెప్పారు.
Telangana
Enforcement Directorate
Nama Nageshwar Rao
Khammam District
TRS

More Telugu News