Ashok Gajapathi Raju: దేశంలో చట్టాలున్నాయని మరోసారి రుజువైంది: అశోక్ గజపతిరాజు

  • మాన్సాస్ ట్రస్టు కేసులో హైకోర్టు తీర్పు
  • ట్రస్టు చైర్మన్ గా అశోక్ గజపతిరాజు పునర్నియామకం
  • సంచయిత నియామకం రద్దు
  • రాజ్యాంగాన్ని గౌరవించడం నేర్చుకోవాలన్న అశోక్ గజపతి
Ashok Gajapathi opines on High Court verdict

మాన్సాస్ ట్రస్టు, సింహాచలం దేవాలయ ట్రస్టు బోర్డు చైర్మన్ గా తన  పునర్నియామకంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు స్పందించారు. దేశంలో చట్టాలున్నాయని మరోసారి రుజువైందని అన్నారు. తాను ట్రస్టు చైర్మన్ గా వ్యవహరించిన సమయంలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేశారని, అక్రమాలు నిజంగానే జరిగుంటే ఇప్పటివరకు ఎందుకు నిరూపించలేకపోయారని ప్రశ్నించారు.

తనపై కక్షతో మాన్సాస్ ట్రస్టు ఉద్యోగులను పలు ఇబ్బందులకు గురిచేశారని, ఈ క్రమంలోనే మాన్సాస్ ట్రస్టు కార్యాలయాన్ని మరోచోటికి తరలించారని వెల్లడించారు. ఆఖరికి మూగజీవాలను కూడా హింసించారని, రాక్షసులు కూడా ఇలా చేసివుండరని ఆయన వ్యాఖ్యానించారు. ఇకనైనా చట్టాలను, రాజ్యాంగాన్ని గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికారు. తీర్పు ఉత్తర్వులు అందాక మిగతా వివరాలు అందిస్తానని తెలిపారు.

More Telugu News