Corona Matha Temple: యూపీలో కరోనా మాత పేరిట ఆలయం

  • శుక్లాపూర్ గ్రామంలో మందిరం నిర్మించిన గ్రామస్థులు 
  • కరోనా నుంచి కాపాడుతుందని నమ్మిక
  • విగ్రహానికి కూడా మాస్కు
  • తండోపతండాలుగా వస్తున్న ప్రజలు
Corona Matha temple in Uttar Pradesh

విలయతాండవం చేస్తున్న మహమ్మారి నుంచి రక్షించాలంటూ ఉత్తరప్రదేశ్ లోని శుక్లాపూర్ గ్రామ ప్రజలు కరోనా మాతను ప్రార్థిస్తున్నారు. వారు కరోనా మాత పేరిట ఏకంగా ఓ ఆలయాన్ని నిర్మించారు. గ్రామస్థులు చందాలు వేసుకుని ఈ ఆలయ నిర్మాణం చేపట్టారు. ఓ వేప చెట్టు వద్ద ఉండే ఈ కరోనా అమ్మవారి మందిరానికి ప్రజలు తండోపతండాలుగా వస్తుండడం విశేషం. ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ, భక్తులకు తీర్థప్రసాదాలు కూడా పంచిపెడుతున్నారు.

దీనిపై గ్రామస్థులు స్పందిస్తూ...  ప్రాణాంతక కరోనా వైరస్ వేలాది మంది ప్రజలను పొట్టనబెట్టుకుంటోందని, అందుకే తాము కరోనా మాత ఆలయం నిర్మించామని వెల్లడించారు. అమ్మవారి ప్రార్థిస్తే కరోనా బారి నుంచి తప్పక రక్షిస్తుందన్న సంపూర్ణ విశ్వాసంతో ఉన్నామని తెలిపారు.

ఆసక్తికర అంశం ఏమిటంటే.. ఈ మందిరంలో కరోనా అమ్మవారి విగ్రహం కూడా మాస్కు ధరించి ఉంటుంది. ఇక్కడికి శుక్లాపూర్ గ్రామస్థులే కాకుండా, పరిసర గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. అందుకే, ఇక్కడికి వచ్చేవారు తప్పకుండా మాస్కులు ధరించి రావాలని, భౌతికదూరం పాటించాలని స్థానికులు కోరుతున్నారు.

More Telugu News