AP High Court: ఆనందయ్య కంటిమందుపై తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు

AP High Court reserves verdict on Anandaiah eye drops
  • ఆనందయ్య కంటిమందుపై హైకోర్టులో విచారణ
  • ముగిసిన వాదనలు
  • కమిటీ నివేదిక రావాల్సి ఉందన్న ప్రభుత్వం
  • 3 వారాల సమయం పడుతుందని వెల్లడి
ఆనందయ్య కరోనా ఔషధానికి ఇటీవల అనుమతి ఇచ్చిన ఏపీ హైకోర్టు, నేడు కంటిమందుపై విచారణ చేపట్టింది. వాదనలు విన్న అనంతరం తీర్పును రిజర్వ్ లో ఉంచింది. వాదనల సందర్భంగా... ఆనందయ్య కంటిమందును తాము వ్యతిరేకించడం లేదని, అయితే కంటిమందు విషయంలో నిపుణుల కమిటీ రావాల్సి ఉందని ప్రభుత్వం కోర్టుకు వెల్లడించింది. నిపుణుల కమిటీ ఆమోదం లేకుండా కంటి మందుకు అనుమతి ఇవ్వలేమని ప్రభుత్వం పేర్కొంది.

దీనిపై ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, అత్యవసర పరిస్థితిలో ఉన్నవారికి కంటి మందుకు అనుమతి ఇస్తారా? అని ప్రశ్నించింది. ఆ విధంగా అయితే అందరూ అత్యవసర పరిస్థితి అంటూ వస్తారని ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆనందయ్య తరఫు న్యాయవాది అశ్వినీకుమార్ మాట్లాడుతూ, రోజుకు 20 మందే వస్తున్నారని వెల్లడించారు.

ఈ నేపథ్యంలో, ప్రభుత్వం స్పందిస్తూ... నివేదిక వచ్చేందుకు 3 వారాలు పడుతుందని, ఇప్పటికిప్పుడు అనుమతి ఇవ్వలేమని పేర్కొంది. ఇరువర్గాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టు వెల్లడించింది. 
AP High Court
Anandaiah Eye Drops
Govt
Andhra Pradesh
Corona Pandemic

More Telugu News