YS Sharmila: దూకుడు పెంచుతున్న షర్మిల.. రేపు కేసీఆర్ నియోజకవర్గంలో పర్యటన

  • క్షేత్ర స్థాయి పర్యటనలకు రెడీ అయిన షర్మిల
  • తొలి పర్యటన కేసీఆర్ నియోజకవర్గంలోనే
  • ఆత్మహత్యలకు పాల్పడిన నిరుద్యోగుల కుటుంబాలకు పరామర్శ
YS Sharmila to visit KCR constituency Gajwel tomorrow

తెలంగాణలో కొత్త పార్టీని ప్రారంభించబోతున్న వైయస్ షర్మిల దూకుడు పెంచుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర విమర్శలను గుప్పిస్తున్న ఆమె... తన రాజకీయ కార్యాచరణను మరింత తీవ్రతరం చేస్తున్నారు. ఇప్పటి వరకు తన కార్యాలయంలో జిల్లా నేతలు, కార్యకర్తలతో వరుస సమావేశాలను నిర్వహించిన ఆమె... ఇకపై క్షేత్ర స్థాయి పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారు.

తొలుత కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్ తో తన రాష్ట్ర పర్యటనను ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో రేపు గజ్వేల్ లో ఆమె పర్యటించనున్నారు. రేపు ఉదయం హైదరాబాదులోని గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళి అర్పించిన తర్వాత... అక్కడి నుంచి గజ్వేల్ కు పయనమవుతారు. ఉద్యోగాలు లేక ఆత్మహత్యలకు పాల్పడిన నిరుద్యోగుల కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు.

ఇదిలావుంచితే, ఏప్రిల్ 9న ఖమ్మంలో ఆమె నిర్వహించిన బహిరంగసభ విజయవంతమైంది. కొత్త పార్టీని స్థాపించబోతున్నట్టు ఆ సభలో ఆమె అధికారికంగా ప్రకటించారు. జూన్ నెలలో పార్టీ పేరు, జెండా, అజెండాను ప్రకటిస్తానని వెల్లడించారు. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు, రిటైర్డ్ ఉన్నతాధికారులు ఆమెను కలిసి మద్దతును ప్రకటించడం గమనార్హం.

More Telugu News