Nara Lokesh: క్రిస్ గేల్ రికార్డును మన కెప్టెన్ బాదుడు రెడ్డి బద్దలు కొట్టారు: సీఎం జగన్ పై లోకేశ్ వ్యంగ్యం

  • రూ.100 దాటిన లీటర్ పెట్రోల్ ధర
  • ఏపీ ప్రభుత్వంపై లోకేశ్ ఫైర్ 
  • నాడు ట్యాక్సులు తగ్గించుకోమన్నారని వెల్లడి
  • విపక్షనేతగా జగన్ ఫేక్ కబుర్లు చెప్పారని విమర్శలు
Lokesh slams CM Jagan over petro prices hike

అంతకంతకు పెరుగుతున్న పెట్రోల్ ధర రూ.100 దాటిందంటూ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఐపీఎల్ లో క్రిస్ గేల్ సుడిగాలి సెంచరీతో రికార్డు స్థాపించాడని, అయితే ఇప్పుడా రికార్డును ఇండియన్ పెట్రోల్ లీగ్ (ఐపీఎల్)లో 3 క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ బాదుడు రెడ్డి బద్దలు కొట్టారని వ్యంగ్యం ప్రదర్శించారు. దేశంలో లీటరు పెట్రోల్  రేటు సెంచరీ దాటించిన రాష్ట్రాల్లో ఏపీని అగ్రస్థానంలో నిలపడం ద్వారా, అవినీతిలోనూ, ధరలు పెంచడంలోనూ తానే ఏ1 అని జగన్ నిరూపించుకున్నారని ఎద్దేవా చేశారు.

ట్యాక్సులు తగ్గించుకుంటే పెట్రోల్, డీజిల్ తక్కువ ధరలకే ఇవ్వొచ్చని నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ బాదుడు రెడ్డి ఫేక్ కబుర్లు చెప్పారని ఆరోపించారు. కానీ అధికారం చేపట్టాక మామూలు ట్యాక్స్ లను రెండింతలు చేసి, దానికి జే ట్యాక్స్ కూడా కలిపి మరీ పెట్రోల్ ధరను సెంచరీ దాటించారని వెల్లడించారు. ఈ మేరకు గతంలో విపక్షనేతగా జగన్ చేసిన వ్యాఖ్యల వీడియోను కూడా లోకేశ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.

More Telugu News