Raghu Rama Krishna Raju: ఎన్ హెచ్ఆర్ సీ చైర్మన్ పీసీ పంత్ ను కలిసిన రఘురామకృష్ణరాజు

  • సీఐడీ పోలీసుల తీరుపై ఫిర్యాదు
  • థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపణ
  • చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
  • ఇటీవల ఎన్ హెచ్ఆర్ సీకి ఫిర్యాదు చేసిన రఘురామ తనయుడు
Raghurama Krishna Raju met NHRC chairman PC Pant

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ఆర్ సీ) చైర్మన్ పీసీ పంత్ ను కలిశారు. ఇటీవల తనను అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు విచారణ సందర్భంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపించారు. సీఐడీ పోలీసులు మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు.

కాగా, రఘురామ విషయంలో ఆయన కుమారుడు కనుమూరి భరత్ ఇప్పటికే ఎన్ హెచ్ఆర్ సీకి ఫిర్యాదు చేశారు. భరత్ ఫిర్యాదును స్వీకరించిన మానవ హక్కుల కమిషన్ అంతర్గత విచారణకు ఆదేశించింది. ఏపీ ప్రభుత్వంతో పాటు, డీజీపీ, సీఐడీకి నోటీసులు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో, ఎన్ హెచ్ఆర్ సీ చైర్మన్ ను స్వయంగా కలిసిన రఘురామ సీఐడీ అధికారుల తీరును వివరించారు. దీనిపై స్పందించిన చైర్మన్ మొత్తం వ్యవహారంపై విచారణ చేపడతామని చెప్పినట్టు తెలుస్తోంది.

రఘురామ నిన్న ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ ను కలిసి సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి రిజిస్ట్రార్ కేపీ రెడ్డిపై ఫిర్యాదు చేయడం తెలిసిందే. తనను ఆసుపత్రి నుంచి త్వరగా డిశ్చార్జి చేసేలా వైద్యులను కేపీ రెడ్డి ఒత్తిడి చేశారని రఘురామ ఆరోపించారు.

More Telugu News