Arvind Kejriwal: మాకు నేరుగా వ్యాక్సిన్లు అమ్మలేమని ఫైజర్, మోడెర్నాలు చెప్పాయి: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్

  • రాష్ట్రాలకు నేరుగా అమ్మలేమని చెప్పాయి 
  • కేంద్రంతోనే ఒప్పందం చేసుకుంటామని తెలిపాయి
  • కేంద్రం విదేశాల నుంచి వ్యాక్సిన్ దిగుమతి చేసుకోవాలి
Pfizer and Moderna refused to sell vaccine to Delhi says Arvind Kejriwal

ఢిల్లీ రాష్ట్రానికి నేరుగా కరోనా వ్యాక్సిన్లను అమ్మబోమని ఫార్మా కంపెనీలు ఫైజర్, మోడెర్నాలు తెలిపాయని సీఎం కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోబోమని... కేంద్ర ప్రభుత్వంతోనే ఒప్పందం చేసుకుంటామని స్పష్టం చేశాయని అన్నారు.

ఇరు కంపెనీలతో తమ ప్రభుత్వం చర్చలు జరిపిందని... అయితే ఢిల్లీకి డైరెక్ట్ గా వ్యాక్సిన్ ను అమ్మలేమని ఆ సంస్థలు తెలిపాయని చెప్పారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకుని, రాష్ట్రాలకు పంపిణీ చేయాలని కేంద్రాన్ని కోరుతున్నామని అన్నారు. ఇదే విషయాన్ని నిన్న పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కూడా చెప్పారు.

మరోవైపు ప్రధాని మోదీకి నిన్న కేజ్రీవాల్ లేఖ రాశారు. ప్రతి నెల ఢిల్లీకి 80 లక్షల డోసుల వ్యాక్సిన్ అవసరమని... అయితే తమకు కేవలం 16 లక్షల డోసులు మాత్రమే వచ్చాయని చెప్పారు. మే నెలలో తమకు రావాల్సిన వాటాలో మరో 8 లక్షల డోసులను తగ్గించారని అసహనం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ కోసం రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు గొడవపడే పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు.

More Telugu News