Andhra Pradesh: కర్ఫ్యూ టైమింగ్ మారిందనే వార్తల్లో నిజం లేదు: ఏపీ ప్రభుత్వం

  • ఉదయం 6 నుంచి 10 వరకు మాత్రమే ఆంక్షల సడలింపు అంటూ ప్రచారం
  • కర్ఫ్యూ సమయంలో మార్పులు చేయలేదన్న ప్రభుత్వం
  • తప్పుడు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
Curfew timing is not changed clarifies AP Govt

కరోనాను కట్టడి చేయడానికి ఏపీ ప్రభుత్వం కర్ఫ్యూని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ కర్ఫ్యూ విషయానికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ఈ నెల 20 నుంచి కర్ఫ్యూ సమయాల్లో మార్పులు జరగనున్నాయని... ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే ఆంక్షల నుంచి మినహాయింపు ఉంటుందనేదే ఆ సమాచారం. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని ప్రకటించింది.

కర్ఫ్యూ సమయాల్లో ఎలాంటి నిజం లేదని ప్రభుత్వం తెలిపింది. ఇప్పుడు ఉన్న మాదిరిగానే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే కర్ఫ్యూ సడలింపులు ఉంటాయని చెప్పింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఇలాంటి తప్పుడు కథనాలను ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

More Telugu News