Kerala: కేరళ కేబినెట్​ లో కె.కె.శైలజకు దక్కని చోటు!

  • పక్కనపెట్టిన సీఎం పినరయి విజయన్
  • గత ఏడాది కరోనా కట్టడిలో ఆమెకు మంచి పేరు
  • అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుకున్న ‘టీచర్’
  • ఈసారి అంతా కొత్తవారేనన్న సీపీఎం
Kerala CM Drops KK Shailaja From Cabinet

కరోనా కట్టడిలో ఆమె ఎంతో మంచి పేరు సంపాదించారు. మహమ్మారి వ్యాప్తిని అరికట్టడంలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుండి నడిపించిన ‘టీచర్’. ఆమె నిర్ణయాలను ప్రధాని నరేంద్ర మోదీ సైతం మెచ్చుకున్నారు. పలు మీడియా సంస్థలు ప్రశంసిస్తూ కథనాలు ప్రచురించాయి. ఆమే కేరళ మాజీ ఆరోగ్య శాఖ మంత్రి కె.కె. శైలజ.

అలాంటి ‘టీచర్’ను తాజా కేబినెట్ నుంచి సీఎం పినరయి విజయన్ తప్పించేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఆయన  కొత్త మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేశారు. అందులో టీచర్ గా పిలుచుకునే కె.కె. శైలజకు మాత్రం చోటివ్వలేదు.

కొత్త మంత్రివర్గానికి సంబంధించిన వివరాలను సీపీఎం నేత ఎ.ఎన్. షంషీర్ వెల్లడించారు. కేబినెట్ లో సీపీఎం పార్టీ నుంచి సీఎం పినరయి విజయన్ ఒక్కరే పాతవారని, మిగతా 11 మంది మంత్రులంతా కొత్తవారే ఉంటారని ఆయన చెప్పారు. యువతకూ ఈసారి కేబినెట్ లో ప్రాధాన్యముంటుందన్నారు. పాతవారికి ఈసారి చోటు లేదన్నారు. ఇది పార్టీ తీసుకున్న నిర్ణయమన్నారు. పార్టీ ఎవరినీ వదులుకోబోదన్నారు. అందరూ పార్టీ నిర్ణయాన్ని గౌరవించాల్సిందేనని చెప్పారు.

21 మంది మంత్రులతో ఈ నెల 20న సీఎం పినరయి విజయన్ ప్రమాణ స్వీకారం చేస్తారని సీపీఎం రాష్ట్ర ఇన్ చార్జి కార్యదర్శి, ఎల్డీఎఫ్ కన్వీనర్ ఎ. విజయరాఘవన్ చెప్పారు. మంత్రుల శాఖలను ముఖ్యమంత్రే నిర్ణయిస్తారన్నారు. కూటమిలో ప్రధాన పార్టీ అయిన సీపీఎం నుంచి 12 మంది, సీపీఐ నుంచి నలుగురు, కేరళ కాంగ్రెస్ (ఎం), జనతాదళ్ (ఎస్), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)ల నుంచి ఒక్కొక్కరికి మంత్రిగా అవకాశం దక్కనుంది.

More Telugu News