Virologist: 'ఇన్సాకోగ్' అధిపతి పదవికి ప్రముఖ వైరాలజిస్టు షాహిద్ జమీల్ రాజీనామా.. ప్రభుత్వంపై కాంగ్రెస్ విమర్శలు!

  • జినోమ్ సీక్వెన్సింగ్ కోసం ఏర్పాటు చేసిన కన్సార్టియం నుంచి తప్పుకున్న జమీల్
  • రాయిటర్స్ కథనంలో ప్రభుత్వంపై జమీల్ సునిశిత విమర్శలు
  • శాస్త్రవేత్తల హెచ్చరికలను మోదీ పట్టించుకోవడం లేదన్న కాంగ్రెస్ నేతలు  
Virologist Shahid Jameel quits from INSACOG

కరోనా మహమ్మారిపై పోరు కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్యానెల్ నుంచి ప్రముఖ వైరాలజిస్ట్ షాహీద్ జమీల్ వైదొలగడం సంచలనమైంది. కరోనా విషయంలో ప్రభుత్వంపై జమీల్ ఇటీవల సునిశిత విమర్శలు చేశారు. ఆయన రాజీనామాకు ఈ విమర్శలకు సంబంధం ఉండొచ్చని చెబుతున్నారు. జమీల్ రాజీనామా రాజకీయంగానూ దుమారం రేపేలా కనిపిస్తోంది. ఆయన రాజీనామాపై స్పందించిన కాంగ్రెస్ కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది.

కరోనా వైరస్‌కు సంబంధించి జినోమ్ సీక్వెన్సింగ్ కోసం ఏర్పాటు చేసిన కన్సార్టియం (ఇన్సాకోగ్)‌కు చైర్మన్‌గా ఉన్న జమీల్ ఆ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాతి నుంచి ఆయన అందుబాటులో లేకుండా పోయారు. కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు మార్చిలోనే హెచ్చరించినా భారత ప్రభుత్వం పట్టించుకోలేదని ‘రాయిటర్స్’ ఇటీవల ఓ కథనాన్ని ప్రచురించింది.

వాస్తవాల ఆధారంగా విధాన రూపకల్పన చేయడానికి ప్రభుత్వం సన్నద్ధంగా లేదని జమీల్ ఆ కథనంలో పేర్కొన్నారు. విధానాల రూపకల్పన విషయంలో ప్రభుత్వం సైన్స్‌ను పరిగణనలోకి తీసుకోలేదని తాను భయపడుతున్నానని, అయితే తన అధికార పరిధి ఏంటో తనకు తెలుసని అన్నారు. శాస్త్రవేత్తలుగా తాము ఆధారాలను మాత్రమే ప్రభుత్వానికి అందిస్తామన్నారు. విధాన రూపకల్పన మాత్రం ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుందన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యల తర్వాత రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

జమీల్ రాజీనామాపై స్పందిస్తూ కాంగ్రెస్ నేతలు ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు. ఆ పార్టీ సీనియర్ నేతలు జైరాం రమేశ్, దిగ్విజయ్ సింగ్, మనీశ్ తివారీ తదితరులు ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. శాస్త్రవేత్తల హెచ్చరికలను మోదీ పట్టించుకోకపోవడమే నేటి ఈ దుస్థితికి కారణమని మండిపడ్డారు.

More Telugu News