తెలంగాణ సర్కారుకు ఎటుచూసినా వైఫల్యాలే: విజయశాంతి
- తెలంగాణ పరిణామాలపై విజయశాంతి వ్యాఖ్యలు
- పరిస్థితులను చక్కదిద్దే ప్రణాళిక సర్కారుకు లేదని విమర్శ
- గతంలోనే చర్యలు తీసుకుని ఉంటే బాగుండేదని వివరణ
- వ్యాక్సినేషన్ ఎందుకాపేశారన్న విజయశాంతి
- కరోనాను ఇప్పటికీ ఆరోగ్యశ్రీలో చేర్చలేదని విమర్శలు
రాష్ట్రంలో ఇంకా 6.90 లక్షల పైచిలుకు వ్యాక్సిన్ డోసుల నిల్వ ఉన్నా, గత 3 రోజుల నుంచి వ్యాక్సినేషన్ ఆపేశారని విజయశాంతి ఆరోపించారు. "కరోనాను ఇప్పటికీ ఆరోగ్యశ్రీలో చేర్చలేదు, ఆయుష్మాన్ భారత్ అమలు కావడంలేదు.... కరోనా కట్టడిపై తెలంగాణ ప్రభుత్వ వైఖరి ఇలా ఉంది" అని విమర్శించారు.
మరోవైపు, మల్లాపూర్ కు చెందిన నిండు గర్భిణీని చేర్చుకోవడానికి 5 ఆసుపత్రులు నిరాకరించి ఆమెను మృత్యుకోరల్లోకి నెట్టిన వైనం అత్యంత వేదన కలిగిస్తోందని తెలిపారు. ఎంతోమంది బాధితులు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారని విజయశాంతి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయమై తక్షణమే దృష్టి సారించాలని స్పష్టం చేశారు.
అటు, తెలంగాణ రైతు మరోసారి కడగండ్ల పాలయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్ల కొనుగోలులో తెలంగాణ సర్కారు ఉదాసీన వైఖరి ప్రదర్శించడంతో, ధాన్యం వర్షం పాలై రైతులు మరోసారి నష్టపోయారని ఆమె తెలిపారు.