Covid Patient: కొవిడ్ రోగి దేశంలో ఎక్కడైనా ఆసుపత్రిలో చేరొచ్చు: కేంద్రం స్పష్టీకరణ

  • ఇతర రాష్ట్రాల కొవిడ్ పేషెంట్లను అడ్డుకుంటున్న పలు రాష్ట్రాలు!
  • గుర్తింపు కార్డు లేకపోయినా చేర్చుకోవాలన్న కేంద్రం
  • ఏ ఆసుపత్రి నిరాకరించకూడదని వెల్లడి
  • సుప్రీంకోర్టులో ఈ మేరకు అఫిడవిట్ దాఖలు
Centre tells supreme court covid patient can admit anywhere in country

పలు రాష్ట్రాలు ఇతర రాష్ట్రాల కొవిడ్ పేషెంట్లను అడ్డుకుంటున్న నేపథ్యంలో కేంద్రం నుంచి స్పష్టత వచ్చింది. కొవిడ్ రోగి దేశంలో ఎక్కడైనా ఆసుపత్రిలో చేరవచ్చని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో కేంద్రం వెల్లడించింది. ఎలాంటి గుర్తింపు కార్డు లేకపోయినా, కొవిడ్ పాజిటివ్ టెస్టు రిపోర్టు లేకపోయినా కరోనా రోగిని చేర్చుకోబోమని ఏ ఆసుపత్రి నిరాకరించరాదని స్పష్టం చేసింది. అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆసుపత్రులు ఈ మేరకు నడుచుకోవాలని పేర్కొంది.

కొవిడ్ నిర్ధారణ అయిన, కొవిడ్ అనుమానితుల  అంశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మూడంచెల మౌలిక సదుపాయాల వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించినట్టు తన అఫిడవిట్ లో కేంద్రం వెల్లడించింది. అంతేకాకుండా, దేశంలో పరిమితంగానే వ్యాక్సిన్ డోసుల లభ్యత ఉన్నందున ఒక్క విడతలో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ అమలు చేయలేకపోతున్నామని కేంద్రం సుప్రీంకోర్టుకు వివరించింది.

దేశంలో కరోనా సంక్షోభం నేపథ్యంలో సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ ప్రారంభించడం తెలిసిందే. ఈ క్రమంలోనే కోర్టు ఆదేశాల మేరకు కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది.

More Telugu News