BJP: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన ఓ కేంద్రమంత్రి, ఇద్దరు ఎంపీలు

  • నిషిత్ ప్రామాణిక్ మినహా మిగతా వారందరూ ఓటమి
  • చున్‌చురా నుంచి బరిలోకి ఎంపీ లాకెట్ ఛటర్జీ
  • తారకేశ్వర్ నుంచి రాజ్యసభ సభ్యుడు స్వపన్ దాస్ గుప్తా పోటీ  
  • టోలీగంజ్ నుంచి పోటీ చేసిన కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో ఓటమి
3 BJP MPs lost in West Bengal assembly polls

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీకి 8 విడతల్లో జరిగిన ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ మరోమారు జయభేరి మోగించింది. 200కుపైగా స్థానాలు కైవసం చేసుకుని సత్తా చాటింది. అదే సమయంలో బెంగాల్‌లో అధికారంలోకి వస్తామని బీరాలు పలికిన బీజేపీ డబుల్ డిజిట్‌కే పరిమితమైంది. ఈ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగిన బీజేపీ సర్వశక్తులు ఒడ్డింది. కేంద్ర సహాయమంత్రి సహా నలుగురు ఎంపీలను బరిలోకి దింపింది.

వీరిలో ఎంపీ నిషిత్ ప్రామాణిక్ మినహా మిగతా వారు ఓడిపోయారు. టోలీగంజ్ నుంచి బరిలోకి దిగిన కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో, చున్‌చురా నుంచి పోటీ చేసిన ఎంపీ లాకెట్ ఛటర్జీ, తారకేశ్వర్ నుంచి బరిలోకి దిగిన రాజ్యసభ సభ్యుడు స్వపన్ దాస్ గుప్తా టీఎంసీ అభ్యర్థుల చేతుల్లో ఓటమి పాలయ్యారు. అయితే, దిన్‌హటా స్థానం నుంచి పోటీ చేసిన ఎంపీ నిషిత్ ప్రామాణిక్ మాత్రం తన సమీప టీఎంసీ ప్రత్యర్థిపై 5,175 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

More Telugu News