Apollo: రేపటి నుంచి వ్యాక్సినేషన్‌ ప్రారంభించనున్న అపోలో, మ్యాక్స్‌!

  • రేపటి నుంచి మూడో విడత వ్యాక్సినేషన్‌
  • 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా
  • తమ వద్ద కొవిషీల్డ్‌ ఉన్నాయన్న అపోలో
  • కార్పొరేట్లకు ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తామని ప్రకటన
  • రేపటి వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి సిద్ధమవుతున్నామన్న మ్యాక్స్‌
Apollo and max Are Going To start Vaccination from tomorrow

రేపటి నుంచి ప్రారంభం కానున్న మూడో విడత వ్యాక్సినేషన్‌లో టీకాలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రైవేటు ఆసుపత్రులు అపోలో, మ్యాక్స్‌ గ్రూప్‌లు ప్రకటించాయి. శనివారం నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ కరోనా టీకాలు అందించనున్న విషయం తెలిసిందే.

పరిమిత టీకాలతో ప్రారంభం కానున్న తమ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం రానున్న వారాల్లో వేగవంతం చేస్తామని అపోలో ఓ ప్రకటనలో పేర్కొంది. కార్పొరేట్లకు ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తామని తెలిపింది. తమ వద్ద కొవిషీల్డ్‌ టీకాలు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించింది. అలాగే రేపటి నుంచి ప్రారంభం కానున్న వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి సిద్దమవుతున్నామని మ్యాక్స్‌ ప్రకటించింది.

మూడో విడత వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రాలు, ప్రైవేట్‌ ఆసుపత్రులు నేరుగా తయారీ సంస్థల వద్దే టీకాలను కొనుగోలు చేసేందుకు కేంద్రం అనుమతించిన విషయం తెలిసిందే. అలాగే ప్రైవేట్ ఆసుపత్రులకు సీరం తమ కొవిషీల్డ్‌ టీకా ఒక్కో డోసును రూ.600కు, భారత్‌ బయోటెక్‌ తమ టీకా ఒక్కో డోసును రూ.1200 విక్రయిస్తామని ప్రకటించాయి.

మరోవైపు 18 ఏళ్ల పైబడిన వారందరికీ రేపటి నుంచే టీకా అందించేందుకు సిద్ధంగా లేమని చాలా రాష్ట్రాలు ప్రకటించాయి. టీకాల కొరత కారణంగానే ఈ మేరకు ప్రకటనలు చేశాయి. ఈ నేపథ్యంలో ప్రైవేట్‌ ఆసుపత్రులు మాత్రం వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభించనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.

More Telugu News