TS Municipal Elections: గ్రేటర్ వరంగల్ లో ఉద్రిక్తత... బీజేపీ కార్యకర్తలు కాషాయదుస్తుల్లో వచ్చి ఓటేశారంటూ టీఆర్ఎస్ ఆగ్రహం

  • తెలంగాణలో మినీ మున్సిపోల్స్
  • కొనసాగుతున్న పోలింగ్
  • పలుచోట్ల ఉద్రిక్తతలు
  • వరంగల్ లో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య తోపులాట
  • ఖమ్మంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య బాహాబాహీ
Greater Warangal corporation elections

తెలంగాణలో మినీ నగరపాలక, పురపాలక ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.  కాగా, రాష్ట్రంలో అక్కడక్కడా ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. గ్రేటర్ వరంగల్ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. శివనగర్ 34వ డివిజన్ లో ఓ పోలింగ్ బూత్ వద్ద బీజేపీ కార్యకర్తలు కాషాయదుస్తుల్లో వచ్చి ఓటేశారంటూ టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ బూత్ ల వద్ద బీజేపీ శ్రేణులు ప్రచారం నిర్వహిస్తున్నాయని టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు రంగప్రవేశం చేసి వారిని చెదరగొట్టారు.

అటు, ఖమ్మంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య బాహాబాహీ నెలకొంది. దొంగ ఓట్లు వేస్తున్నారంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది.

సిద్ధిపేటలో ఓటేసిన హరీశ్ రావు

రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు సిద్ధిపేట మున్సిపల్ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. పట్టణంలోని 23వ వార్డులో తన ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. పోలింగ్ సందర్భంగా సెలవు ప్రకటించామని, అందుకే ప్రతి ఒక్క ఓటరు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయాలని అన్నారు. కరోనా మార్గదర్శకాలకు అనుగుణంగానే పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు

More Telugu News