Cowin: టీకా కావాలంటూ దరఖాస్తు చేసుకున్న 1.33 కోట్ల మంది!

  • బుధవారం మొదలైన రిజిస్ట్రేషన్స్
  • ఆదిలో అడ్డంకులు ఏర్పడినా ఆపై సాఫీగా రిజిస్ట్రేషన్
  • పరిస్థితిని అర్థం చేసుకోవాలన్న కేంద్రం
Above 1 Crore 30 Lakhs Cowin Registrations

18 ఏళ్లు నిండిన భారతీయులందరికీ మరో రెండు రోజుల్లో మూడవ దశ వ్యాక్సినేషన్ లో భాగంగా టీకా ఇచ్చే ప్రక్రియ ప్రారంభం కానుంది. టీకా కావాలని భావించే వారు కొవిన్ వెబ్ సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటూ, ఆరోగ్య శాఖ కోరింది. నిన్న సాయంత్రం 4 గంటల తరువాత వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ ప్రారంభం కాగా, గంటల వ్యవధిలోనే 1.33 కోట్ల మంది రిజిస్టర్ చేయించుకున్నారు. వీరంతా 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయసున్న వారే.

వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్స్ ప్రారంభం కాగానే నిమిషానికి 27 లక్షల హిట్స్ రావడంతో, వెబ్ సైట్ స్తంభించిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆపై సమస్య పరిష్కారం అయిందని, రిజిస్టర్ చేయించుకున్న వారికి రాష్ట్రాల ప్రభుత్వాలు, ప్రైవేటు వ్యాక్సినేషన్ సెంటర్లలో స్లాట్ల అందుబాటును బట్టి, సమాచారం ఇచ్చి టీకాలు వేయిస్తామని తెలిపాయి. మరిన్ని అపాయింట్ మెంట్ స్లాట్లకు అవకాశం ఉందని, ఒకవేళ స్లాట్లు ఖాళీగా లేవని వెబ్ సైట్ లో కనిపిస్తే, కొంతకాలం తరువాత మరోసారి చెక్ చేసుకోవాలని, టీకా కావాలని భావించే వారు పరిస్థితిని అర్థం చేసుకుని, ఓపికతో ఉండాలని పేర్కొన్నారు.

శనివారం నాడు వ్యాక్సినేషన్ ప్రారంభం అవుతుందని తెలిపిన అధికారులు, రిజిస్ట్రేషన్స్ ను ఆరోగ్య సేతు యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చని తెలిపారు. సీరమ్ తయారు చేస్తున్న కొవిషీల్డ్ తో పాటు, భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కొవాగ్జిన్ ను అందిస్తున్నామని, తొలి డోస్ గా ఏ వ్యాక్సిన్ ను తీసుకుంటే, రెండో డోస్ గా అదే తీసుకోవాలని వెల్లడించారు.

More Telugu News