Farmer: ఆక్సిజన్ కోసం... కూతురి పెళ్లికి దాచిన డబ్బును విరాళంగా ఇచ్చేసిన రైతు

Farmer donates money to oxygen supply in Madhya Pradesh
  • దేశంలో కల్లోలభరిత పరిస్థితులు
  • ఆక్సిజన్ దొరక్క చావులు
  • కదిలిపోయిన మధ్యప్రదేశ్ రైతు
  • ఈ నెల 25న కుమార్తె వివాహం
  • అంతకుముందే విరాళాన్ని కలెక్టర్ కు అందించిన వైనం
భారత్ లో గడచిన 24 గంటల్లో 3.23 లక్షల కొత్త కేసులు, 2,700కి పైగా మరణాలు సంభవించడం పరిస్థితి తీవ్రతను చాటుతోంది. బెడ్లు దొరక్క, ఆక్సిజన్ లభ్యం కాక చనిపోతున్న వారి సంఖ్య అధికమవుతోంది. దాంతో భారత్ యుద్ధప్రాతిపదికన ఆక్సిజన్ సమకూర్చుకుంటోంది. అందుకు ఇతర దేశాల సాయం కూడా తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ కు చెందిన ఓ రైతు నిర్ణయం అందరికీ స్ఫూర్తిదాయకం.

నీముచ్ జిల్లాలోని దేవియాన్ గ్రామానికి చెందిన చంపాలాల్ గుర్జార్ ఓ వ్యవసాయదారుడు. ఆరుగాలం కష్టించిన సొమ్మును తన కుమార్తె అనిత పెళ్లి కోసం దాచాడు. ఆ విధంగా రూ.2 లక్షలు పొదుపు చేశాడు. అయితే, దేశంలోని పరిస్థితులు చంపాలాల్ ను కలచివేశాయి. తన కుమార్తె పెళ్లి కంటే ప్రస్తుత పరిస్థితుల్లో సాటి మనుషులకు సాయపడడమే ముఖ్యమని భావించాడు. కుమార్తె అనిత కూడా తండ్రి నిర్ణయానికి మద్దతు పలికింది.

అయితే, అనిత పెళ్లి ఈ నెల 25న జరిగింది. ఈ వివాహానికి ముందే విరాళం ఇవ్వాలని అనిత తండ్రికి సూచించింది. దాంతో చంపాలాల్ కుమార్తె చెప్పినట్టుగానే పెళ్లికి ముందు రూ.2 లక్షల నగదును జిల్లా కలెక్టర్ అగర్వాల్ కు విరాళంగా అందించాడు. ఆక్సిజన్ సరఫరా కోసం తన విరాళాన్ని ఉపయోగించాలని విజ్ఞప్తి చేశాడు.
Farmer
Donation
Money
Daughter Marriage
Oxygen
Madhya Pradesh

More Telugu News