KL Rahul: మా ఆటపై ఏమనాలో తెలియడం లేదు: కేఎల్ రాహుల్!

  • సోమవారం రాత్రి అహ్మదాబాద్ లో మ్యాచ్
  • సునాయాసంగా గెలిచిన మోర్గాన్ సేన
  • బ్యాటింగ్ లో గతి తప్పామన్న కేఎల్ రాహుల్
  • రిస్క్ చేయాలన్న ప్రతి ఒక్కరూ అవుటయ్యారన్న రాహుల్
Cant Talk on Defete says KL Rahul

సోమవారం రాత్రి అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుపై పంజాబ్ కింగ్స్ జట్టు ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు, కేవలం 123 పరుగులు మాత్రమే చేయగా, ఆ స్కోరును కోల్ కతా జట్టు 16.4 ఓవర్లలోనే అధిగమించి విజయం సాధించింది.

ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన పంజాబ్ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్, తన జట్టు ఆటగాళ్ల తీరుపై అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఇటువంటి చెత్త ప్రదర్శన తరువాత తమ ఆటపై ఏం మాట్లాడాలో తెలియడం లేదని వ్యాఖ్యానించాడు. బ్యాటింగ్ లో తమ నాణ్యత గతి తప్పిందని, ఇదే సమయంలో కొన్ని మంచి బాల్స్ తమ ఆటను ప్రభావితం చేశాయని వ్యాఖ్యానించాడు. రిస్క్ చేసి షాట్లు కొట్టాలని చూసిన ప్రతి ఒక్కరూ పెవీలియన్ దారి పట్టారని అన్నాడు.

ఈ పిచ్ పరిస్థితిని తొందరగా అర్థం చేసుకున్న కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు విజయాన్నిసులువుగా అందుకుందని, వారు ఈ గెలుపునకు అర్హులని వ్యాఖ్యానించాడు. ఇక తమ ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్, జట్టులోని ఆటగాళ్లను ఎంతో తీర్చిదిద్దుతున్నారని, తమ తప్పులను ఎప్పటికప్పుడు సరిచేస్తున్నాడని కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు. తదుపరి మ్యాచ్ లలో తాము సమష్టిగా రాణించి విజయాలు సాధిస్తామన్న నమ్మకం ఉందని తెలిపారు.

కాగా, సోమవారం నాటి మ్యాచ్ లో కెప్టెన్ మోర్గాన్ 47 పరుగులు, త్రిపాఠి 41 పరుగులు చేయడంతో కేకేఆర్ జట్టు నాలుగు ఓటముల తరువాత 5 వికెట్ల తేడాతో విజయం సాధించి, పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న తన స్థానాన్ని కాస్తంత మెరుగుపరచుకుంది.

More Telugu News