Bollywood: కరోనాతో కన్నుమూసిన బాలీవుడ్ సంగీత దర్శకుడు శ్రావణ్

Composer Shravan Rathod dies due to Covid
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత
  • బాలీవుడ్‌లో పలు హిట్ చిత్రాలకు సంగీతం
  • నదీమ్-శ్రావణ్ జంటగా చిరపరిచితం
కరోనా మహమ్మారి బాలీవుడ్‌లో మరో ప్రముఖుడిని బలితీసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు శ్రావణ్ రాథోడ్ (66) కరోనాతో మృతి చెందారు. మరో సంగీత దర్శకుడు నదీమ్‌తో కలిసి శ్రావణ్ సంగీతాన్ని సమకూర్చేవారు. నదీమ్-శ్రావణ్ జంటగా బాలీవుడ్‌లో ఈ ద్వయం చిరపరిచితం. సూపర్ డూపర్ హిట్ చిత్రాలైన ఆషికి, సాజన్, పరదేశ్, రాజా హిందూస్థానీ వంటి అనేక చిత్రాలకు వీరే సంగీతాన్ని అందించారు.

ఇటీవల శ్రావణ్ కు కరోనా సంక్రమించింది. ఆరోగ్యం క్షీణించడంతో ముంబైలోని ఎల్ఎల్ రహేజా ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స తీసుకుంటున్న ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో గత రాత్రి 10.15 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు సంజీవ్ వెల్లడించారు. శ్రావణ్ కుమారులైన సంజీవ్, దర్శన్ కూడా సంగీత దర్శకులుగానే స్థిరపడ్డారు. శ్రావణ్ మృతితో మంచి మిత్రుడిని కోల్పోయానని గాయకుడు అద్నాన్ సమీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం తెలిపారు.

More Telugu News

Bollywood
Music Composer
COVID19
Died