Modi: బెంగాల్‌ పర్యటనను రద్దు చేసుకున్న మోదీ

  • కరోనా ఉద్ధృతి నేపథ్యంలో రేపు ఉన్నత స్థాయి సమీక్ష
  • ఇప్పటికే పలు పార్టీలు సభలు, ర్యాలీలకు దూరం
  • ఆక్సిజన్‌ సరఫరాపై నేడు మోదీ సమీక్ష
  • రాష్ట్రాలకు వేగంగా సరఫరా చేయాలని ఆదేశం
Modi cancelled his bengal tour

దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపటి(శుక్రవారం) పశ్చిమ బెంగాల్‌ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు. దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితిపై సమీక్షలో భాగంగా ఉన్నతస్థాయి సమావేశాలకు హాజరుకావాల్సి ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు వెల్లడించారు.

కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు బెంగాల్‌లో బహిరంగ సభలు, ర్యాలీలకు స్వస్తి పలికాయి. ఒక్క అధికార పార్టీ బీజేపీ మాత్రమే సభలు నిర్వహిస్తూ వచ్చింది. అయితే, రాష్ట్రంలో కరోనా ప్రమాదకర స్థాయిలో విజృంభిస్తుండడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ  క్రమంలో తాజాగా ప్రధాని తన పర్యటనను రద్దు చేసుకోవడం గమనార్హం.

అంతకుముందు దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌ సరఫరాపై మోదీ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సరిపడా ఆక్సిజన్‌ ను అందుబాటులోకి  తెచ్చేందుకు ఉన్న మార్గాలపై చర్చించారు. ఆక్సిజన్‌ కొరతను అధిగమించేందుకు గత కొన్ని వారాలుగా తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా అధికారులు మోదీకి వివరించారు.  ఎలాంటి అంతరాయం లేకుండా రాష్ట్రాలకు వీలైనంత త్వరగా ఆక్సిజన్‌ అందించాలని అధికారులను ఆదేశించారు. ఉత్పత్తిని పెంచి వేగంగా సరఫరా చేసేందుకు ఉన్న వినూత్న మార్గాలను అన్వేషించాలని మోదీ వివిధ మంత్రిత్వ శాఖలను ఆదేశించారు.

More Telugu News