Banks: తెలంగాణలో బ్యాంకు పనివేళల కుదింపు.. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకే సేవలు!

  • నిర్ణయించిన ఎస్ఎల్‌బీసీ
  • 50 శాతం సిబ్బందితోనే విధులు
  • ప్రభుత్వానికి ప్రతిపాదన
  • రేపటి నుంచే అమల్లోకి!
Bank working hours to be shortened in Telangana

తెలంగాణలో బ్యాంకుల పనివేళలను తగ్గించాలని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్‌బీసీ) నిర్ణయించినట్టు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రస్థాయిలో ప్రతాపం చూపిస్తుండడం, స్టేట్ బ్యాంకు ఉద్యోగులు దాదాపు 600 మంది వైరస్ బారినపడడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే సేవల్ని పరిమితం చేయాలని ఎస్ఎల్‌బీసీ యోచిస్తోంది. అలాగే, సిబ్బందిని 50 శాతానికి పరిమితం చేయాలని కూడా నిర్ణయించింది.

వచ్చే నెల 15వ తేదీ వరకు బ్యాంకు వేళలను కుదించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వ ఆమోదానికి పంపినట్టు తెలుస్తోంది. అనుమతి వస్తే రేపటి నుంచే కొత్త పనివేళలు అమల్లోకి వస్తాయి. అయితే బ్యాంకుల ప్రధాన కార్యాలయాల వేళల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదు. బ్యాంకు పనివేళలను కనుక తగ్గిస్తే ఏటీఎంలు, క్యాష్ డిపాజిట్ మిషన్ల సహా ఇతర ఆన్‌లైన్ సేవలకు అంతరాయం కలగకుండా చూడాలని ఎస్ఎల్‌బీసీ బ్యాంకర్లను ఆదేశించింది. కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో తప్పనిసరి సేవలకు మాత్రమే బ్యాంకులకు రావాలని వినియోగదారులకు సూచించింది.

More Telugu News