సీబీఐ విచార‌ణ జ‌రిపించాలంటూ ఏపీ సీఎస్‌కు ఏబీ వెంకటేశ్వరరావు లేఖ‌.. ప‌లు ఆధారాలు అంద‌జేత

ab venkateshwarrao writes letter to cs
షార్ట్స్‌లో చూడండి
నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు జ‌రిగాయ‌ని, సర్వీస్‌ నిబంధనలు అతిక్రమించి నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలపై ఐపీఎస్‌ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావుపై ఏపీ ప్రభుత్వం స‌స్పెన్ష‌న్‌ వేటు వేసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న‌పై ఉన్న‌ ఆరోప‌ణ‌ల‌పై కమిషనరాఫ్ ఎంక్వైరీస్ ఏబీ వెంకటేశ్వరరావుపై ఇటీవ‌లే 14 రోజుల విచార‌ణ పూర్తి చేసింది.

ఈ నేపథ్యంలో.. తనకు వ్య‌తిరేకంగా న‌కిలీ డాక్యుమెంట్లు సృష్టించారనేదానికి త‌న వ‌ద్ద‌ సాక్ష్యాలున్నాయని, ఈ  విషయాన్ని విచారణాధికారికి చెప్పాన‌ని ఆ సంద‌ర్భంగా ఆయ‌న తెలిపారు. కృత్రిమ డాక్యుమెంట్ల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలన్నారు. త్వ‌ర‌లోనే ఆ ప‌త్రాల వివ‌రాల‌ను ప్ర‌భుత్వానికి ఇస్తాన‌ని ఇటీవ‌ల చెప్పారు.

చెప్పిన‌ట్లుగానే తాను చేసిన‌ ఆరోపణలను రుజువు చేసే 9 పత్రాలను జోడిస్తూ ప్ర‌భుత్వానికి ఈ రోజు ఏబీ లేఖ రాశారు. ఈ నేప‌థ్యంలో త‌న‌పై  కేసును కేంద్ర ద‌ర్యాప్తు బృందం (సీబీఐ)తో విచార‌ణ జ‌రిపించాలంటూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ను ఆ లేఖలో కోరారు. డీజీపీ స్వ‌యంగా ఫోర్జరీ చేసినట్టు ఆధారాలను లేఖకు జత చేశారు.

డీజీపీ సవాంగ్, సీఐడీ అదనపు డీజీపీ సునీల్ కుమార్, ఏసీబీ డీజీ సీతారామాంజనేయులు, ఇంటెలిజెన్స్ అధికారులు, మరికొందరి ప్రమేయానికి సంబంధించిన పత్రాలు అందజేస్తున్న‌ట్లు తెలిపారు. ఒక‌వేళ‌ సీబీఐతో విచారణకు ప్రభుత్వం సిఫార్సు చేయ‌క‌పోతే దీనిపై కూడా కోర్టుకు వెళ్లాల‌ని ఆయ‌న భావిస్తున్నారు.  ఇప్పటికే సుప్రీంకోర్టులో ఆయ‌న వేసిన పిటిష‌న్‌పై విచారణ జరుగుతోంది.
Go Back to Shorts
AB Venkateswara Rao
Andhra Pradesh
YSRCP

More Telugu News