Kesavarao: ప్రొఫెసర్ సాయిబాబాను ఉద్యోగం నుంచి తొలగించడం మానవ హక్కుల ఉల్లంఘన: కేకే

  • మావోలతో లింకుల నేపథ్యంలో ప్రొఫెసర్ సాయిబాబా అరెస్ట్
  • 2014లో అరెస్ట్ చేసిన మహారాష్ట్ర పోలీసులు
  • జీవితఖైదు విధించిన కోర్టు
  • తాజాగా ఉద్యోగం నుంచి తొలగించిన రామ్ లాల్ ఆనంద్ కాలేజి
  • కేసు విచారణలో ఉండగా ఎలా తప్పిస్తారన్న కేకే
TRS MP Kesavarao says termination of Prof Saibaba from job a human rights violation

మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై అరెస్టయిన ప్రొఫెసర్ సాయిబాబా ప్రస్తుతం నాగపూర్ జైల్లో ఉన్నారు. 2014లో ఆయనను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేయగా, కోర్టు జీవితఖైదు విధించింది. అయితే తాజాగా ఢిల్లీ వర్సిటీకి చెందిన రామ్ లాల్ ఆనంద్ కళాశాల ప్రొఫెసర్ సాయిబాబాను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది. దీనిపై టీఆర్ఎస్ ఎంపీ కె.కేశవరావు స్పందించారు.

సాయిబాబాను ఉద్యోగం నుంచి తొలగించడం మానవ హక్కుల ఉల్లంఘనే అని విమర్శించారు. కేసు విచారణలో ఉండగానే సాయిబాబాను ఉద్యోగం నుంచి ఎలా తప్పిస్తారని ప్రశ్నించారు. ఇంతకుముందు అనేకమంది కోర్టుల్లో నిర్దోషులుగా బయటికి వచ్చి తమ ఉద్యోగాల్లో చేరారని కేకే వివరించారు. ప్రొఫెసర్ సాయిబాబా అంగవైకల్యాన్ని పరిగణనలోకి తీసుకుని ఆయనను జైలు నుంచి విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

అటు, సాయిబాబాను ఉద్యోగం నుంచి టెర్మినేట్ చేయడంపై ఆయన భార్య వసంత కోర్టుకు వెళ్లాలని భావిస్తున్నారు. ఒక ఉద్యోగి హక్కులను కాలరాయడమేనని ఆమె ఆక్రోశించారు.

More Telugu News