ఆసుపత్రిలో చేరిన శరద్ పవార్.. సర్జరీ నిర్వహించనున్న వైద్యులు!
- రేపు ఆసుపత్రిలో చేరాల్సి ఉన్న పవార్
- పొత్తికడుపులో మరోసారి నొప్పి రావడంతో ఈరోజే చేరిక
- పిత్తాశయంలో రాళ్లతో బాధపడుతున్న పవార్
శరద్ పవార్ కు పిత్తాశయంలో రాళ్లు ఏర్పడినట్టు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయిందని... ఆయనకు సర్జరీ అవసరమని నిన్న ఆయన పార్టీ ప్రకటించింది. అయితే పొత్తికడుపులో నొప్పి రావడంతో ఆయనకు మరోసారి పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయనను ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు.
గత కొన్నాళ్లుగా ఆయన రక్తాన్ని పలుచన చేసే చికిత్సను తీసుకుంటున్నారని... అయితే, తాజా పరిస్థితుల వల్ల ఆ చికిత్సను ఆపేశారని ఎన్సీపీ అధికార ప్రతినిధి చెప్పారు. వైద్యులు ఆయనకు సర్జరీని నిర్వహించబోతున్నారని తెలిపారు. పవార్ అధికారిక కార్యక్రమాలన్నీ రద్దయినట్టు వెల్లడించారు. శరద్ పవార్ వయసు 80 ఏళ్లు కావడంతో... పార్టీ శ్రేణులు ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నాయి.