Aryaman Birla: మన దేశంలో అత్యంత సంపన్న క్రికెటర్ ఇతనే!

  • అత్యంత సంపన్న క్రికెటర్ ఆర్యమన్ బిర్లా
  • కుమారమంగళం బిర్లా కుమారుడే ఆర్యమన్
  • మధ్యప్రదేశ్ తరపున రంజీలు ఆడుతున్న యువ క్రికెటర్
Aryaman Birla is richest cricketer in India

మన దేశంలో అత్యంత సంపన్నమైన క్రికెటర్ ఎవరని ఎవరైనా అడిగితే... మనకు వెంటనే సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ వంటి పేర్లు గుర్తుకొస్తాయి. వాస్తవానికి వీరంతా సంపన్నులైన క్రికెటర్లే. వందలాది కోట్ల రూపాయలను వీరు సంపాదించారు.

అయితే, అసలు సంపన్న క్రికెటర్ మాత్రం వీరిలో ఎవరూ కాదు. ఒక నూనూగు మీసాల యువకుడే మన దేశంలో సూపర్ రిచ్ క్రికెటర్. సచిన్, ధోనీ, కోహ్లీవంటి వారు అతని దరిదాపుల్లోకి కూడా రాలేరు. ఆతను మరెవరో కాదు... 23 ఏళ్ల ఆర్యమన్. ప్రస్తుతం మధ్యప్రదేశ్ జట్టు తరపున రంజీ మ్యాచులు ఆడుతున్న ఆర్యమన్ బిర్లా.

ఆర్యమన్ బిర్లా అనే పేరు వినగానే అందరికీ అర్థమై ఉంటుంది. అవును... అతను మరెవరో కాదు. రూ. 80 వేల కోట్ల బిర్లా వ్యాపార సామ్రాజ్యానికి వారసుడు... ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార మంగళం బిర్లా కుమారుడు. త్వరలోనే బిర్లా గ్రూప్ పగ్గాలను ఆర్యమన్ స్వీకరించబోతున్నాడు.

అయితే క్రికెట్ అంటే అతనికి ఎంతో ప్రేమ. ఈ ఆటలో రాణించాలనేది అతని కోరిక. ఇండియా తరపున అంతర్జాతీయ మ్యాచ్ ఆడాలనేది అతని కల. తన కలను నెరవేర్చుకోవడానికి ఆర్యమన్ ప్రతిరోజు గ్రౌండ్ లో ఎంతో కష్టపడుతుంటాడు. 2018 ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ అతన్ని రూ. 31 లక్షలకు కొనుగోలు చేసింది. ఎడమ చేతివాటం ఆల్ రౌండర్ అయిన ఆర్యమన్ గతంలో జరిగిన సీకే నాయుడు ట్రోఫీలో సత్తా చాటాడు. 6 మ్యాచుల్లో 795 పరుగులు చేశాడు.

More Telugu News