Chennai: చెన్నైలో ఇంటి దగ్గరే కరోనా వ్యాక్సిన్​!

  • చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ డ్రైవ్
  • వీలైనంత ఎక్కువ మందికి టీకాలిచ్చేందుకు కార్యక్రమం
  • ఏప్రిల్ నాటికి పావు వంతు జనాభాకు వేయాలని నిర్ణయం
  • ఇప్పటిదాకా ఇచ్చింది 6.5 శాతం మందికే
In Chennai Get Covid Vaccine At Your Doorstep

గంటల కొద్దీ క్యూలో నిలబడి కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలంటే చాలా మంది వృద్ధులకు సమస్యగా మారుతోంది. చాలా మంది బయటకు రాలేని వారూ ఉంటున్నారు. అలాంటి వారి కోసమే తమిళనాడు రాజధాని చెన్నైలో అధికారులు నేరుగా ఇంటికి వెళ్లి కరోనా వ్యాక్సిన్ వేస్తున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ను వేసేందుకు గానూ చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది.

‘‘చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయం చాలా మంచిది. బయటకు వెళ్లి క్యూలో నిలబడలేని నా లాంటి వారికి ఎంతో ఉపయోగకరం’’ అని కృష్ణ జి. రావు అనే 95 ఏళ్ల మాజీ సైనికుడు చెప్పారు. ఇంటికి వెళ్లడమే కాకుండా కాలనీలు, కమ్యూనిటీలకు వెళ్లి సామూహిక వ్యాక్సినేషన్ కార్యక్రమాన్నీ నిర్వహిస్తున్నారు.


మంగళవారం చెన్నైలోని 2,000 మంది ఉన్న ఓ కాలనీలో కొన్ని గంటల్లోనే 400 మందికి వ్యాక్సిన్ వేశారు. ఒక్క వృద్ధులకే కాదు.. 45 ఏళ్ల లోపు వారికీ ఇంటి దగ్గర, కమ్యూనిటీల్లో వ్యాక్సిన్ వేస్తున్నామని ఆశా వర్కర్లు చెబుతున్నారు. మరోవైపు వృద్ధులు, 45 ఏళ్లు నిండి వేరే జబ్బులతో బాధపడే వారే లక్ష్యంగా ఇంటి దగ్గరికే కరోనా వ్యాక్సిన్ సేవలను అందజేస్తున్నట్టు చెన్నై కార్పొరేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ లోగేశ్ యువరాజ్ చెప్పారు.

ప్రస్తుతం చెన్నైలో ఐదు లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు. నగర జనాభాలో ఆ వాటా కేవలం 6.5 శాతమే. ఈ నేపథ్యంలోనే వీలైనంత ఎక్కువ మందికి కరోనా వ్యాక్సిన్లు వేయాలని కార్పొరేషన్ కమిషనర్ జి. ప్రకాశ్ టార్గెట్ పెట్టారు. ఈ నెలాఖరు నాటికి పది లక్షల మందికి, ఏప్రిల్ నాటికి జనాభాలో పావు వంతు మందికి వ్యాక్సిన్ వేసేందుకు లక్ష్యం పెట్టుకున్నట్టు ఆయన చెప్పారు. రోజూ సగటున 60 వేల మందికి టీకాలు ఇస్తామన్నారు. ఇంటి వద్దకే వెళ్లి వ్యాక్సిన్ వేసే ఈ కార్యక్రమానికి చెన్నై మున్సిపల్ కార్పొరేషన్.. ‘ఇంటి వద్దకే ఆసుపత్రులు’ అని పేరు పెట్టింది.

More Telugu News