Karnataka: ప్రియురాలు మోసం చేస్తోందని కక్షగట్టి... దోపిడీకి ప్లాన్ వేసిన ప్రియుడు!

  • కర్ణాటక రాజధాని బెంగళూరులో ఘటన
  • స్నేహితుల సాయంతో ఆభరణాల దోపిడీ
  • ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు
Man Cheats Lover in Bengalore

తానెంతగానో ప్రేమించిన ప్రియురాలు, మరొకరితో తిరుగుతూ మోసం చేస్తుందన్న కోపాన్ని పెంచుకున్న ఓ యువకుడు, తనకు స్నేహితులైన మరో ఇద్దరితో కలిసి ఆమెను నిలువునా దోచుకున్నాడు. కర్ణాటకలో జరిగిన ఈ ఘటన గురించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, బెంగళూరుకు చెందిన జాకీర్ హుస్సేన్ అనే యువకుడు ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. అయితే, గత కొంతకాలంగా ఆమె మరొకరితో తిరుగుతోందని గమనించి, కోపాన్ని పెంచుకున్నాడు.

ఆమెను దెబ్బతీయాలని నిర్ణయించుకుని, తన స్నేహితుల సహాయాన్ని కోరాడు. వారు అంగీకరించిన తరువాత తన ప్లాన్ అమలు చేశాడు. ఆమె రోడ్డుపై వెళుతుండగా, జాకీర్ స్నేహితులు షాబాజ్ ఖాన్, ఫాజిల్ కలసి ఆమెను అడ్డగించి, ఆమె వద్ద ఉన్న 102 గ్రాముల బంగారు నగలను దోచుకుని పారిపోయారు. ఈ బంగారం విలువ సుమారు రూ. 3 లక్షలు. యువతి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, కేసును విచారించి, నిందితులను అరెస్ట్ చేయగా, జాకీర్ ప్లాన్ బయటపడింది.

తాను ప్రేమించిన యువతి తనను విస్మరిస్తున్నదన్న కోపంతోనే ఈ పని చేసినట్టు జాకీర్ విచారణలో వెల్లడించినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోందని వెల్లడించాయి.

More Telugu News