Assam: రాహుల్‌కు అసోం పర్యటన ఓ విహారయాత్ర లాంటిది: అమిత్‌ షా విమర్శలు

Assam tour is like picnic for rahul gandhi says amit shah
  • అసోంలో జోరుగా సాగుతున్న ఎన్నికల ప్రచారం
  • కాంగ్రెస్‌, బీజేపీ పరస్పర ఆరోపణలు
  • 15 ఏళ్ల పాలనలో కాంగ్రెస్‌ ఏమీ చేయలేదని ఆరోపించిన షా
  • అధికారం కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్న కాంగ్రెస్‌
అసోం ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా  తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రచారంలో భాగంగా అసోంకు వస్తున్న రాహుల్‌కు అదొక విహార యాత్ర లాంటిదని ఎద్దేవా చేశారు. ఉదల్‌గురి ప్రాంతంలో సోమవారం జరిగిన ర్యాలీలో పాల్గొని ఆయన ప్రసంగించారు.

‘‘ఇటీవల రాహుల్‌ గాంధీ అసోం పర్యటనకు వచ్చారు. ఆయనకు అసోం రావడం అంటే ఓ విహారయాత్ర లాంటిదే. ఆయన కార్మికుల గురించి మాట్లాడితే నాకు నవ్వొస్తుంది. వారు అధికారంలో ఉన్నప్పుడు తేయాకు తోటల్లో పనిచేసే కార్మికులకు ఏమీ చేయలేదు. కానీ, ఇప్పుడు ప్రగల్భాలు పలుకుతున్నారు’’ అని కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు.

గత ఐదేళ్లలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను షా వివరించారు. ఉదల్‌గురి రైల్వే స్టేషన్‌ను ఆధునికీకరించామని తెలిపారు. అలాగే 39 వేల కుటుంబాలకు ఉచిత గ్యాస్‌ కనెక్షన్లు అందించామన్నారు. ప్రభుత్వం చొరవతో దాదాపు 2,000 మంది చొరబాటుదారులు ఆయుధాలను వదిలి జనజీవన స్రవంతిలోకి వచ్చారని తెలిపారు. అలాగే సరిహద్దు విషయంలో బంగ్లాదేశ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు.

15 ఏళ్ల పాటు ఏకధాటిగా అసోంను పాలించిన కాంగ్రెస్‌ 2016లో బీజేపీ చేతిలో పరాజయం చవిచూసింది. దీంతో ఈసారి అధికారంలోకి రావాలని కాంగ్రెస్‌ నిశ్చయంగా ఉంది. ఈ నేపథ్యంలో రాహుల్‌, ప్రియాంక గాంధీ వాద్రా విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు.

More Telugu News

Assam
Amith shah
Rahul Gandhi
Congress