Indian Railways: రైల్వే ప్రయాణికుల ఆశలపై నీళ్లు.. జులై వరకు రెగ్యులర్ రైళ్లు లేనట్టే!

  • జూన్, జులై వరకు ప్రత్యేక రైళ్ల పొడిగింపు
  • ప్రయాణికులపై ‘ప్రత్యేక’ బాదుడు
  • 80 శాతం రైళ్లను పునరుద్ధరించినా ‘ప్రత్యేకమే’
No Regular trains till july

రెగ్యులర్ రైళ్ల కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులకు రైల్వే షాకిచ్చింది. జులై వరకు ఆ ఊసే లేదని పరోక్షంగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లలో కొన్నింటిని జూన్ నెలాఖరు వరకు, మరికొన్నింటిని జులై తొలి వారం వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అంటే అప్పటి వరకు రెగ్యులర్ రైళ్లు లేనట్టే. ఫలితంగా ప్రయాణికుల నెత్తిన అదనపు చార్జీల మోత తప్పదు.

గతేడాది కరోనా లాక్‌డౌన్ తర్వాత రైళ్ల రాకపోకలను ప్రభుత్వం నిలిపివేసింది. అయితే, ఆ తర్వాత వైరస్ క్రమంగా తగ్గుముఖం పట్టడంతో ప్రయాణికుల అవసరార్థం గతేడాది చివరి నుంచి పలు జాగ్రత్తలతో ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత వాటిని క్రమంగా పెంచుకుంటూ పోయింది. ప్రస్తుతం 80 శాతానికిపైగా రైళ్లను పునరుద్ధరించినట్టు ఇటీవల రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.

అయినప్పటికీ ‘ప్రత్యేకం’ అనే ట్యాగ్ తీయకుండా అదనపు చార్జీలతో వీటిని నడిపిస్తున్నారు. గోదావరి, శబరి, సిర్పూర్ కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లను అవే రూట్లలో, అవే సమయాల్లో నడిపిస్తున్నా వాటిని ప్రత్యేక రైళ్లుగానే పరిగణిస్తూ చార్జీలపై అదనపు వడ్డన వడ్డిస్తున్నారు. రైల్వే తీరుపై  ప్రయాణికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

More Telugu News