తెలంగాణ బడ్జెట్ అంకెలు చూస్తే అబ్బో అనిపించేలా ఉన్నాయి: రఘునందన్ రావు

BJP MLA Raghunandan Rao opines on Telangana Budget
  • బడ్జెట్ అంకెల గారడీ అంటూ విమర్శలు
  • అంకెలకు తగ్గట్టుగా ఖర్చు చేయాలని హితవు
  • నిధులు ఎక్కడ్నించి తెస్తారో చెప్పాలని డిమాండ్
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పై దుబ్బాక ఎమ్మెల్యే, బీజేపీ నేత రఘునందన్ రావు స్పందించారు. రాష్ట్ర బడ్జెట్ అంకెలు చూస్తే అబ్బో అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. అంకెలేమో గొప్పగా ఉన్నాయని, కానీ అదే స్థాయిలో ఖర్చు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కరోనా కాలంలో నిధులు ఎక్కడ్నించి తెస్తారో చెప్పకుండా అంకెలు పెంచి ప్రజలను మాయ చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఎంపీటీసీలకు రూ.200 కోట్లు ఇస్తాం, జడ్పీటీసీలకు రూ.500 కోట్లు ఇస్తాం అంటూ నిరుత్సాహంలో ఉన్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను మచ్చిక చేసుకోవడానికి ఈ బడ్జెట్ అంకెలు గొప్పగా చూపించినట్టు అర్థమవుతోందని అన్నారు.

ఉస్మానియా వర్సిటీకి, ఉస్మానియా ఆసుపత్రికి, క్రీడలకు దేనికి డబ్బుల్లేవు... కానీ బడ్జెట్ మాత్రం అంకెల గారడీని తలపిస్తోంది అని వ్యాఖ్యానించారు. విద్యారంగానికి జాతీయ స్థాయి కంటే తక్కువ నిధులు కేటాయించారని విమర్శించారు. నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.  ఉస్మానియా యూనివర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని స్పష్టం చేశారు.
Go Back to Shorts
Raghunandan Rao
Budget
Telangana
BJP

More Telugu News